ఓయూలో జర్నలిస్టులపై జరిగిన పోలీసుల దాడిని ఖండిద్దాం
అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి
హెచ్ యూజే – టీయూడబ్ల్యూజే నేతలు
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
ఉస్మానియా యూనివర్సిటీలో విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులను అమానుషంగా పోలీసులు లాక్కేళ్లడం అప్రజాస్వామికమని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు యూనియన్ రాష్ట్ర కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ అధ్యక్షులు శిగ శంకర్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాలరాజులు ఘటనపై స్పందించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనను కవర్ చేసేందుకు వెళ్లిన జీటీవీ ప్రతినిధి శ్రీచరణ్ పై పోలీసులు అమానుషంగా ప్రవర్తించడం సిగ్గుచేటు అన్నారు. చొక్కా పట్టుకుని లాక్కెళ్లడమే కాకుండా, కెమెరాలను తీయొద్దంటూ బెదిరించడం దారుణమన్నారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ జర్నలిస్టుల పట్ల దాడులకు పాల్పడడం అడప దడప జరుగుతూనే ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు. జర్నలిస్టులపై దాడులకు పాల్పడిన పోలీసుల పట్ల చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.