యువ సంగ్రామ సభను విజయవంతం చేద్దాం
– జెట్టి శివ ప్రసాద్ యాదవ్
రామన్నపేట అక్షిత ప్రతినిధి
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన యూత్ డిక్లరేషన్ హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్వీ నియోజకవర్గ మాజీ అధ్యక్షుడు జెట్టి శివ ప్రసాద్ యాదవ్ విమర్శించారు. నిరుద్యోగ యువత, విద్యార్థులకు ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్, కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ల వంటి కీలక అంశాల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని ఆయన పేర్కొన్నారు.ప్రభుత్వానికి హామీలను గుర్తు చేస్తూ వాటి అమలు కోసం ఒత్తిడి తీసుకురావాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 18న హైదరాబాద్లోని సరూర్నగర్లో “యువ సంగ్రామ సభ” నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభ ద్వారా నిరుద్యోగ యువత, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయడం, పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయడం, కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయడం వంటి డిమాండ్లపై ప్రభుత్వానికి గట్టి సందేశం ఇవ్వనున్నట్లు చెప్పారు.రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువత, విద్యార్థులు, బీఆర్ఎస్ శ్రేణులు, యువజన నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన యూత్ డిక్లరేషన్లోని ప్రతి హామీని ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని, యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్వహిస్తున్న ఈ సంగ్రామ సభలో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ హక్కుల సాధనకు గొంతు కలపాలని జెట్టి శివ ప్రసాద్ యాదవ్ కోరారు.