మంచిర్యాల, అక్షిత బ్యూరో:
మంచిర్యాల నియోజకవర్గం నస్పూర్ మున్సిపాలిటీ 5వ వార్డులో మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ గడపగడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్నీ చేపట్టారు. సోమవారం ఐదవ వార్డులోని దేవాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ వల్లనే ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. దేశాన్ని సమైక్యంగా ఉంచాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేపట్టారని తెలిపారు. ఆయనకు మద్దతుగా హాత్ సే హాత్ జోడో అనే నినాదంతో ప్రజల వద్దకు చేరువవుతున్నట్లు వివరించారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం తెలంగాణలో దోపిడీ వ్యవస్థ పెరిగిపోయిందని సురేఖ ఆరోపించారు. సమైక్యపాలనలో కంటే తెలంగాణ రాష్ట్రంలో అక్రమాలు అవినీతి పెరిగిపోయిందని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.