సమ్మెకి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి
* సిఐటియు జిల్లా కార్యదర్శి ఎ.జె.రమేష్
భద్రాద్రి కొత్తగూడెం అక్షిత ప్రతినిధి:
రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా క్రాంతి పథకంలో పని చేస్తున్న17 వేల మంది ప్రారంభించే నిరవధిక సమ్మెకి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎ.జె.రమేష్ అన్నారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో శనివారం జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన వివో ఏ జిల్లా కమిటీ మండల అధ్యక్ష కార్యదర్శులు సంయుక్త సమావేశంలో పాల్గొన్న ఎ.జె.రమేష్ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో డ్వాక్రా మహిళా గ్రూపుల ఏర్పాటులో వాటి పటిష్టతలో ఆర్థికంగా ఎదుగుదలలో కీలక పాత్ర
వివో ఏలు పోషిస్తుంటే వీరికి కేవలం రూ. 2,900 మాత్రమే గౌరవ వేతనం ఇస్తున్నారన్నారు. రోజు రోజుకు పని భారం పెరుగుతూ తీవ్రమైన రాజకీయ ఒత్తిడులకు గురవుతున్నారన్నారు. పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద భీమా సౌకర్యం ఏమీ లేకుండా అభద్రతతో బతుకులు ఈడుస్తున్నారన్నారు. గుర్తింపు కార్డులు కూడా ఇవ్వలేదని బ్యాంక్ లింకేజిలు 8 రకాల ఆన్ లైన్ సేవలు చేయడం ప్రభుత్వం నుండి ఏ సర్వే వచ్చినా కాదనకుండా ఆ సర్వే చేసినా ప్రభుత్వం దృష్టిలో కనీస గుర్తింపు కూడా లేదన్నారు.

గ్రామ సంఘం గ్రేడింగ్ తో సంబంధం లేకుండా ప్రతీ నెల వేతనాలు వ్యక్తిగత ఖాతాకు చెల్లించాలని అర్హులైన వివో ఏ లకు సిసిలుగా ప్రమోషన్స్ ఇవ్వాలని జాబ్ చార్ట్ తో సంబంధం లేని పనులతో సహా ఇతర పనుల్ని చేయించరాదని ఎ.జె.రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత నెల 16,17,18 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా టోకెన్ సమ్మె చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని ఆన్ లైన్ సేవలు ఆపేసినా పట్టించుకోలేదని గత్యంతరం లేని పరిస్థితుల్లో నిరవధిక సమ్మెకి వెళ్లాల్సి వస్తుందని ఎ.జె.రమేష్ అన్నారు. సమ్మె సందర్భంగా ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా పట్టుదలతో సమ్మెని నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి డి వీరన్న, వివో ఏ జిల్లా కార్యదర్శి అరుణ, కోశాధికారి చంద్ర లీల, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీను గోపాల్, సీనియర్ నాయకులు రేష్మా, మాధవి, రమేష్, పద్మ, పాపారావు, కమాల్ స్వరూప, రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.