లెనిన్ సేవలు మరువలేనివి * సిపిఐ, ఏఐటియుసి నాయకులు వై.శ్రీనివాసరెడ్డి, డి.శేషయ్య * శేషగిరిభవన్లో ఘనంగా లెనిన్ 154వ జయంతి వేడుకలు
లెనిన్ సేవలు మరువలేనివి
* సిపిఐ, ఏఐటియుసి నాయకులు వై.శ్రీనివాసరెడ్డి, డి.శేషయ్య
* శేషగిరిభవన్లో ఘనంగా లెనిన్ 154వ జయంతి వేడుకలు
భద్రాద్రి కొత్తగూడెం అక్షిత ప్రతినిధి:
దోపిడి రాజ్యాలకు ప్రత్యామ్నాయంగా శ్రామిక రాజ్యానికి అంకురార్పణ చేసిన అనితర సాధ్యుడు మార్క్సిస్టు సిద్ధాంత సారాన్ని చరిత్ర గమనాన్ని సవ్యంగా అర్ధం చేసుకొని ఖచ్చితమైన సైద్ధాంతిక రాజకీయ వ్యూహాలను అనుసరించగలిగిన అగ్రగన్యుడు లెనిన్ అని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వై.శ్రీనివాసరెడ్డి, ఏఐటియుసి జిల్లా నాయకులు దమ్మాలపాటి శేషయ్య పేర్కొన్నారు. ప్రపంచ కమ్యూనిస్టు యోధుడు మార్క్సిస్టు మహోపాద్యాయుడు, సోషలిస్టు రాజ్య నిర్మాత లెనిన్ 164వ జయంతిని శనివారం సిపిఐ జిల్లా కార్యాలయం శేషగిరిభవన్లో నిర్వహించారు. లెనిన్ చిత్రపఠానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూరేళ్ళ కిందట అస్తమించిన లెనిన్ మార్క్స్ సిద్ధాంతాన్ని మరింత అధునీకరించడమేకాక అమలు చేసి తొలి విప్లవం తీసుకువచ్చిన ధీశాలి అని, మార్క్స్, ఎంగిల్స్ బోధనలను తన కాలానికి అనుగుణంగా సంపన్నం చేయడమేకాక ప్రపంచపు తొలి సామ్యవాద దుర్గంగా సోవియల్ యూనియన్ను స్థాపించిన వ్యూహకర్త, మహోన్నత వ్యక్తి లెనిన్ అని కొనియాడారు. బహుముఖ ప్రజ్ఞ, అపార అధ్యయనం, నిశితమైన సైద్ధాంతిక రచనలు అయన సొంతమని ప్రజలకే అధికారం అందించడం వారితో మమేకం కావడం లెనిన్ ప్రధాన సూత్రంగా పాటించి విజయం సాధించాడన్నారు. అవకాశవాద పోకడలపై పోరాటం ఆశయాల పట్ల అవగా హన ఆచరణలో అప్రమత్తత లెనిన్ మార్గమని పేర్కొన్నారు. లెనిన్ అందించిన పోరాట స్పూర్తి తెగింపు నేటితరం కమ్యూనిస్టు నాయకులు కార్యకర్తలకు స్పూర్తిదాయకమని పేద కార్మిక కర్షకులకోసం తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పోరాడిన నాటి అమరుల ఆశయాల స్ఫూర్తితో కార్పోరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న ప్రస్తుత పాలకులపై పోరాటాలు ముమ్మరం చేయాలని పిలుపునిచ్చారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా, ముస్లిం మైనార్టీ సంఘాల రాష్ట్ర నాయకులు నయిమ్ ఖురేషి లెనిన్ చిత్రపఠం వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా సమితి సభ్యులు భూక్య దస్రు, జక్కుల రాములు, పార్టీ ప్రజా సంఘాల నాయకులు మాచర్ల శ్రీనివాస్, బోయిన విజయ్ కుమార్, కాటూరి రాము, లింగేష్, రజనీకుమార్, సోమయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.