పోలింగ్ కు సర్వం సిద్దం
రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ చెన్నయ్య
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ శాసనసభ నియోజకవర్గంలో ఈ నెల 30న పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేశామని మిర్యాలగూడ ఎన్నికల అధికారి, ఆర్డీఓ బి.చెన్నయ్య తెలిపారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్నికల సామాగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రంలో విలేఖరులతో మాట్లాడుతూ అనుబంధ జాబితా కలుపుకుని సుమారు 2,31,391 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఇందులో పురుషులు 1,13, 912మంది, మహిళలు 1,17,455 మంది, ట్రాన్స్ జెండర్ 25, సర్వీస్ ఓటర్స్ 31 మంది ఉన్నారని ఆయన అన్నారు. నియోజకవర్గంలోని 263 పోలింగ్ కేంద్రాల్లో పర్యవేక్షణకు 30 మంది సెక్టరియల్ ఆఫీసర్స్, 30 మంది రూట్ ఆఫీసర్స్, 1,841 పోలింగ్ సిబ్బందికి శిక్షణ పూర్తి చేశామన్నారు. సుమారు178 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు. నియోజవర్గంలోని సుమారు 1,250 మంది దివ్యాంగులు పోలింగ్ కేంద్రాలకు వచ్చేందుకు ఆటో రిక్షాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు. వారిని పోలింగ్ కేంద్రంలోనికి వీల్ చైర్స్ లో తీసుకెళ్లేందుకు వాలంటీర్లు నియమించామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో పోల్ చిట్టీల కోసం హెల్ప్ డెస్క్, ప్రాథమిక చికిత్స కోసం వైద్య సహాయ టీమ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్నికల సామాగ్రి తరలింపు కేంద్రంలో ఈ నెల 29న సామాగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రమైన స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల అధికారులు, సిబ్బంది పనులు ప్రారంభిస్తారని, 29న 56 బస్సుల్లో సామాగ్రి పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తారన్నారు.
డబ్బు, మద్యం పంపిణీ సమాచారమందిస్తే చర్యలు తీసుకుంటాం….. డిఎస్పీ వెంకటగిరి
మిర్యాలగూడ పోలీసు సబ్ డివిజన్ పరిధిలో పార్టీల నాయకులు, అభ్యర్ధులు డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారని సమాచారం అందిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక డిఎస్పీ పి. వెంకటగిరి తెలిపారు. తనకు గాని సీఐ, ఎస్ఐలు, 100 కు సమాచారం అందిస్తే వెంటనే రంగంలోకి దిగి చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. మిర్యాలగూడలో సెక్షన్ 144 పోలింగ్ రోజున అమలులో ఉంటుందని, పోలింగ్ కేంద్రాల 200మీటర్ ల్ వరకు ఎవరిని అనుమతించమని వారన్నారు. అధికారులు, పోలింగ్ ఏజెంట్లు పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 5 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహిస్తారని పోలింగ్ ఏజంట్లు తెల్లవారుజామున 4 గంటల లోపు చేరుకోవాలని కోరారు. 600 మంది పోలీసులు, సిఐఎఎఫ్ బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు.