ప్రోటోకాల్ దిక్కరణ !
ఏ హోదాతో స్టేజిపై వేణుగోపాల్ రెడ్డి !!|
కాంగ్రెస్ సభను తలపించిన ప్రజాపాలన
మాడ్గులపల్లి, అక్షిత న్యూస్ :
ప్రజాపాలన సభ… పరిహాసాన్ని తలపించింది. ప్రోటోకాల్ దిక్కరణ జరిగింది. ఎలాంటి అధికారిక హోదా లేకున్నప్పటికి ఎంచక్కా స్టేజిపై ఆశీనులైన పరిస్థితి. పాలకులు, అధికారులతో మమేకమై ప్రజాపాలన సభ నిర్వహించాల్సి ఉన్నప్పటికి అందుకు భిన్నంగా మారింది. ప్రొటోకాల్ కు
భిన్నంగా కాంగ్రెస్ సభను తలపించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రజాపాలన పల్లె సభలో ప్రజలు ముక్కున వేలేసుకునే పరిస్థితి దావురించింది. ప్రజాపాలన సభలో అధికారులు బృందంగా ఏర్పడి ప్రభుత్వం అమలుచేయాల్సిన ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించేoదుకు అధికారులు పల్లె బాట పట్టారు.

రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన ప్రజా పాలనలో భాగంగా మాడ్గులపల్లి మండలంలోనూ ఆయా గ్రామాల సభలను నిర్వహించేందుకు అధికారులు ఐదు బృందాలుగా ఏర్పడి ఆయా గ్రామాల్లో సభలు నిర్వహించేందుకు షెడ్యూల్ ను ఖరారు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్చావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ సర్కారు ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన నిర్వహించేందుకు శ్రీకారం చుట్టింది. మండలంలోని అధికారులు, ప్రజాపతినిధుల భాగస్వామ్యంతో సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. అందులో భాగంగా మాడ్గులపల్లి మండలంలోని తోపుచర్లలో శనివారం గ్రామసభ జరిగింది. ఎంపిఓ రవికుమార్ సారధ్యంలో అధికారుల బృందం తోపుచర్లకు చేరుకుంది. సభకు అధ్యక్షత వహించిన రవికుమార్ అధికారులు, ప్రజాప్రతినిధులను స్టేజి మీదకు పిలిచారు. జడ్పీటిసి పుల్లెంల సైదులు, సర్పంచి మంగ యాదయ్య, ఎంపిటిసి కత్తి కనకాల్ రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు ఎస్ కే మౌలాలితో పాటు మండల కాంగ్రెస్ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డిలను స్టేజి మీదకు పిలిచారు. ఇక్కడే గ్రామ సభలో లొల్లి షురువైంది. ఏ అధికారిక హోదాతో వేణుగోపాల్ రెడ్డిని స్టేజి మీదకు పిలిచారని సభికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది.దీంతో దరఖాస్తుల స్వీకరణకు ఆటంకం కల్గింది.అధికారిక సభనా? కాంగ్రెస్ సభనా అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ పదవులతో అధికారిక వ్యవహారాల్లో తలదూర్చడంతో సభా కాసింత రసాభాసగా మారింది. దొర అహంకార బుద్దితో వేణుగోపాల్ రెడ్డి వ్యవహార శైలి సామాన్యులను సైతం ఉక్కిరిబిక్కిరి చేసింది. కాసింత లొల్లి రాజుకోగా ఎస్ఐ నరేష్ జోక్యం చేసుకుని సమస్యను సద్దుమణిచారు. అన౦తరం సభలో ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ఏ అధికారిక హోదాతో వేణుగోపాల్ రెడ్డిని స్టేజిపైకి ఆహ్వానించారో? అధికారులు తేటతెల్లం చేయాల్సిన అవసరమెంతైనా ఉంది.