అలసత్వం వహిస్తే
చర్యలు తప్పవు
డుమ్మా కొట్టిన
అధికారులపై ఆగ్రహం
మంత్రి పొంగులేటి
ఆకస్మిక తనిఖీ
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర సచివాలయంలో గురువారం రెవెన్యూ విభాగంలో ఆకస్మిక తనిఖీలు చేశారు .
రెవెన్యూశాఖ విభాగంలో ఉదయం 11.40 వరకు పూర్తిస్థాయిలో ఉద్యోగులు తమ తమ విధులకు హాజరు కాకపోవడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు.. కొంతమంది ఉద్యోగులు ముందస్తు సమాచారం లేకుండా ఆఫీసుకు రాకపోవడం, మరి కొంతమంది సమయానికి రాకపోవడం బాధ్యతరాహిత్యం అన్నారు. ఉన్నతాధికారులకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు…హాజరు పట్టికలు పరిశీలించారు… రెవెన్యూ విభాగంలోని ఐదు సెక్షన్లో ఏ సెక్షన్ లో కూడా పూర్తిస్థాయిలో ఉద్యోగులు సమయానికి హాజరు కాకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రజలకు జవాబు దారిగా ఉండాల్సిన అధికారులు విధుల్లో అలక్ష్యం వహిస్తే తగు చర్యలు ఉంటాయని మంత్రి ఈ సందర్భంగా హెచ్చరించారు.ప్రజా పాలనలో రెవెన్యూశాఖ కీలకపాత్ర వహిస్తుండగా ఇతర విభాగాలకు ఆదర్శంగా ఉండాల్సిన సచివాలయ అధికారులు, సిబ్బందితమ విధుల్లో నిర్లక్ష్యంగా ఉండడం పట్ల మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు.. అధికారులు సిబ్బంది సమయపాలన పాటించి నిజాయితీ నిబద్ధతతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా మంత్రి వ్యాఖ్యానించారు.