భరతమాత సేవలో వెంకయ్య నాయుడు జీవన ప్రస్థానం*

*భరతమాత సేవలో వెంకయ్యగారి జీవన ప్రస్థానం*

భారత ఉప-రాష్ట్రపతి, గౌరవనీయ రాజనీతిజ్ఞుడు శ్రీ వెంకయ్య నాయుడు గారికి ఇవాళ్టితో 75 ఏళ్లు పూర్తవుతాయి. ఈ సందర్భంగా ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను. అలాగే ఆయన శ్రేయోభిలాషులు, అనుయాయులందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అంకితభావం, ఆశావాదంగల ప్రజాసేవపై తిరుగులేని నిబద్ధతను ఆయన జీవన ప్రస్థానం ప్రస్ఫుటం చేస్తుంది. అటువంటి నాయకుడిని గౌరవించుకునేందుకు ఇదే తగిన తరుణం. రాజకీయ రంగ ప్రవేశం నుంచి ఉప-రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించే దాకా సాగిన వెంకయ్యగారి రాజకీయ జీవితం భారత రాజకీయాల్లోని సంక్లిష్టతలను హుందాగా, సులువుగా అధిగమించడంలో ఆయనకుగల అరుదైన సామర్థ్యాన్ని మన ముందుంచుతుంది. శ్రీ వెంకయ్య వాగ్ధాటి, చతురత, ప్రగతి సంబంధిత అంశాలపై దృఢ వైఖరి వంటి సుగుణాలు పార్టీలకు అతీతంగా ఆయనకు ఎనలేని గౌరవం తెచ్చిపెట్టాయి.

వెంకయ్యగారితో నా అనుబంధం దశాబ్దాల నాటినుంచీ కొనసాగుతోంది. మేము చాలాకాలం కలిసి పనిచేసినపుడు ఆయన నుంచి నేనెంతో నేర్చుకున్నాను. ఆయన జీవితంలోని సార్వత్రిక అంశం ఏదైనా ఉందంటే అది ప్రజలపై ప్రేమ. ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థి సంఘ రాజకీయాల ద్వారా విద్యార్థి నాయకుడిగా ఆయనలోని ఆచరణాత్మకత, క్రియాశీలత ముడిపడ్డాయి. వెంకయ్యగారి అపూర్వ ప్రతిభ, వాక్పటిమ, నిర్వహణా నైపుణ్యం రీత్యా ఏ రాజకీయ పార్టీ అయినా ఆయనకు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉంటుంది. అయితే, ‘దేశమే ప్రథమం’ అనే దార్శనికత నుంచి స్ఫూర్తిపొందిన ఆయన సంఘ్ పరివార్‌తో కలిసి పనిచేయడానికే మొగ్గుచూపారు. ఆ విధంగా ‘ఆర్‌ఎస్‌ఎస్‌’, ‘ఏబీవీపీ’లతో ఆయకునగల అనుబంధం తర్వాతి కాలంలో జనసంఘ్‌, బీజేపీల బలోపేతానికి ఎంతగానో దోహదం చేసింది.
దేశంలో దాదాపు 50 ఏళ్ల కిందట ఎమర్జెన్సీ విధించిన వేళ, దాన్ని వ్యతిరేకిస్తూ మొదలైన ఉద్యమంలో చురుకైన పాతికేళ్ల యువకుడుగా వెంకయ్య గారు ముందుకు దూకారు. ఆ క్రమంలో కేవలం లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయ‌ణ్‌ను ఆంధ్రప్రదేశ్‌కి ఆహ్వానించిన పాపానికి ప్రభుత్వం ఆయనను జైలుపాల్జేసింది. ప్రజాస్వామ్యంపై ఈ నిబద్ధత ఆయన రాజకీయ జీవితంలో పలుమార్లు రుజువైంది. మహానేత ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కేంద్రంలోని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 1980ల మధ్యలో అనాలోచితంగా బర్తరఫ్ చేసిన సందర్భంలోనూ ప్రజాస్వామ్య సిద్ధాంత పరిరక్షణ ఉద్యమంలో ఆయన మరోసారి ముందువరుసలో నిలిచారు.
వెంకయ్య గారు ఎలాంటి ఆటుపోట్లనైనా అవలీలగా అధిగమించగల సమర్థులు. ఆంద్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల సందర్భంగా 1978లో ప్రజలు కాంగ్రెస్‌కు అఖండ విజయం కట్టబెట్టినా జనతా పార్టీ అభ్యర్థిగా ఉదయగిరి నుంచి యువ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అటుపైన ఐదేళ్లకు (1983) ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ తొలి ఎన్నికలలోనే సునామీ తరహా ఫలితాలతో రాష్ట్రాన్ని చుట్టబెట్టినా, ఆయన వరుసగా రెండోసారి అదే స్థానం నుంచి ‘బిజెపి’ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ‘బిజెపి’ ఎదుగుదలకు బాటలు వేశారు.

సభాపక్ష నాయకుడుగా పార్టీని విజయవంతంగా నడిపిస్తూ ఆ తర్వాత బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రశాఖ అధ్యక్షుడయ్యారు.
బీజేపీ కేంద్ర నాయకత్వం 1990 దశంలో ఆయన కృషిని గుర్తించింది. ఆ తర్వాత 1993లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఆనాటినుంచీ జాతీయ స్థాయిలో ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. యుక్తవయసులో అటల్ జీ, అద్వానీ జీ వంటి అగ్రనేతల పర్యటనల గురించి ప్రకటించిన ఆయన, అనంతరం కాలంలో వారితో ప్రత్యక్షంగా కలిసి పనిచేయడం అరుదైన అనుభవం. మా పార్టీని అధికారంలోకి తేవడంతోపాటు దేశానికి తొలి బీజేపీ ప్రధానమంత్రి నాయకత్వం వహించేలా చేయడంపై ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయన నిశితంగా దృష్టి సారించారు. ఆ మేరకు ఢిల్లీ వెళ్లిన తర్వాత తన కృషిలో ఏనాడూ వెనుదిరిగి చూసుకునే అవసరం లేకుండా ఏకంగా పార్టీకి జాతీయ అధ్యక్షుడి స్థాయికి ఎదిగారు.
వెంకయ్య గారిని కేంద్ర మంత్రిమండలిలోకి తీసుకునేందుకు 2000 సంవత్సరంలో అటల్ జీ ఆసక్తి చూపారు. ఆ సందర్భంగా వెంకయ్య గారు తక్షణం గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు తాను అత్యంత ప్రాధాన్యం ఇస్తానని ఆయనకు తెలిపారు. దీంతో అటల్ జీ సహా అగ్ర నాయకులందరూ ఆశ్చర్యపోయారు. అన్నింటినీ మించి ఒక నాయకుడిని మీకు ఏ మంత్రిత్వశాఖ కావాలంటూ అభిప్రాయం కోరితే ఎంతమాత్రం తడుముకోకుండా తన ప్రాధాన్యం గ్రామీణాభివృద్ధేనని వెంకయ్య గారు స్పష్టం చేశారు. తానొక రైతు బిడ్డనని, తన బాల్యమంతా గ్రామాల్లోనే గడిచింది కాబట్టి మంత్రిగా తాను కోరుకునేది ఏదైనా ఉందంటే అది గ్రామీణాభివృద్ధేనని వివరించారు. అందుకు తగినట్లుగానే ‘ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన’ వంటి పథకానికి రూపకర్తగా ప్రధాన పాత్ర పోషించారు. అటుపైన కొన్నేళ్ల తర్వాత 2014లో ‘ఎన్‌డిఎ’ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఆ ప్రభుత్వంలో ఆయన పట్టణాభివృద్ధి-గృహనిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన సంబంధిత కీలక శాఖల బాధ్యతలు నిర్వహించారు. ఆయన హయాంలోనే మేము కీలకమైన ‘స్వచ్ఛ భారత్ మిషన్’, పట్టణాభివృద్ధి సంబంధిత ప్రధాన పథకాలకు శ్రీకారం చుట్టాం. ఇంత విస్తృత కాలం పాటు గ్రామీణ-పట్టణాభివృద్ధికి కృషి చేసిన ఏకైక నాయకుడు బహుశా ఆయనే కావచ్చు.

వెంకయ్య గారు ఉప-రాష్ట్రపతిగా పదవీకాలం ముగిసిన తర్వాత కూడా ప్రజా జీవితంలో చురుగ్గా ఉంటున్నారు. తనకు ఆసక్తిగల అంశాలు లేదా దేశవ్యాప్తంగా వివిధ పరిణామాలపై ఆయన అప్పుడప్పుడూ ఫోన్ ద్వారా నన్ను వాకబు చేస్తుంటారు. మా ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇటీవలే నేను ఆయనను కలిశాను. ఆయనెంతో సంతోషంతో నాకు, నా బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి తీపి జ్ఞాపకాలతో వెంకయ్య గారు 75 ఏళ్ల మైలురాయిని చేరడంపై మరోసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. యువ కార్యకర్తలు, ఎన్నికైన ప్రజాప్రతినిధులు, ప్రజా సేవాభిలాషులైన ప్రతి ఒక్కరూ ఆయన జీవితానుభావాల వెలుగులో విలువలను అందిపుచ్చుకోగలరని ఆశిస్తున్నాను. ఆయనవంటి అరుదైన నాయకులే మన దేశాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతూ ఉత్తేజమిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking