కేసీఆర్ పాలనలోనే ఆలయాలకు మహర్దశ
* మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాలనలోనే ఆలయాలకు మహర్దశ వచ్చిందని మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. ఆదివారం మిర్యాలగూడ మండలంలో యాద్గార్ పల్లి గ్రామంలోని శ్రీదేవి-భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి పర్వత వర్ధిని సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి దేవస్థాన సప్తమ వార్షిక కళ్యాణోత్సవ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో నల్లమోతు భాస్కర్ రావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా భాస్కర్ రావు ను ఆలయ కమిటీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఆయన సతీమణి మమత సాదరంగా అహ్వానించి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా భాస్కర్ రావు మాట్లాడారు.
సనాతన హిందూ ధర్మరక్ష పరిరక్షణ కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విశేష కృషి చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధి కోసం, పునర్నిర్మాణం కోసం బీఆర్ఎస్ సర్కారు విశేష కృషి చేసిందని అన్నారు. రాష్ట్రంలోని 4,805 ఆలయాల ధూప, దీప, నైవేధ్యాల కోసం ప్రభుత్వం ప్రతి దేవాలయానికి రూ.6వేలు చొప్పున గౌరవ వేతనం చెల్లించి ఆదుకున్నదని అన్నారు. దీనిలో రూ.2వేలు నిత్య పూజల కోసం, రూ.4 వేలు అర్చకుల కోసం ప్రభుత్వం కేటాయించిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఆలయాలకు పునర్వైభవం వచ్చిందన్నారు. తొలుత 3వేల దేవాలయాలకు ధూప,దీప, నైవేధ్యాల కోసం నిధులను కేటాయించిన ప్రభుత్వం క్రమంగా జీవో నెంబర్ 248 ద్వారా 2017, నవంబర్8 నుంచి 4,805 దేవాలయాలకు వర్తింపజేసిందన్నారు. ఈ పథకం ద్వారా బీఆర్ఎస్ సర్కార్ ప్రతి నెలా రూ.25 కోట్లు కేటాయించిందన్నారు. రాష్ట్రంలోని దేవాలయాలు మాజీ సీఎం కేసీఆర్ కృషితో ఎంతో అభివృద్ధి చెందాయని తెలిపారు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ పున:నిర్మాణం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను, కామన్ గుడ్ ఫండ్ నిధులతో ఇతర ఆలయాల జీర్ణోద్ధరణ, దేవాలయాల నిర్మాణ పనులు చేపట్టారని అన్నారు. కార్యక్రమంలో మిర్యాలగూడ మండలం బీఆర్ఎస్ అధ్యక్షులు మట్టపల్లి సైదులు యాదవ్, పాక్స్ చైర్మన్ పాదూరి సంజీవ రెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ దుండిగాల యాదమ్మ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ జెట్టి లింగయ్య, గ్రామ పార్టీ అధ్యక్షులు చిమట ఆంజనేయులు, వెంకన్న, కొండేటి నాగేందర్, రవి, కొండేటి వెంకన్న, ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.