*రుణమాఫీ చారిత్రాత్మక నిర్ణయం*
*అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం*
*మాట ఇచ్చాం, నిలబెట్టుకున్నాం*
*- రెవెన్యూ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి*
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
ఇది రైతు రాజ్యం…ప్రజాపాలన…
రైతు దేశానికి వెన్నెముక. ఆ రైతుకు వెన్నుదన్నుగా నిలవాలనే ధృడ సంకల్పంతో అన్నదాతలకు ఆర్థిక సహకారం అందజేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం రైతులకు రుణ విముక్తి కల్పించి, చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని రెవెన్యూ శాఖామంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
లక్ష రూపాయల రుణమాఫీ ఒకసారి మాఫీ చేయడం సాధ్యం కాదు, అసలు జరగదు అని ఆనాటి సీఎం కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో ప్రకటిస్తే, ఈనాటి మన సీఎం రేవంత్ రెడ్డిగారు ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకుని అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.
గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయ్యింది. ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీకి ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం సహకరించపోయినా కూడా రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాం. ఆగష్టు 15వ తేదీ లోగా రైతు రుణాలను మాఫీ చేస్తామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ, అంతకంటే నెలరోజుల ముందుగానే హామీని నిలబెట్టుకుని రైతన్నల విషయంలో తమ నిబద్ధతను చాటుకున్నామని అన్నారు.
జూలై 18వ తేదీ లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తున్నామని ఆ రోజు సాయంత్రం వరకు రైతు ఋణ ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నామని ఈరోజు రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించవలసిన రోజు అని అన్నారు.
16 సంవత్సరాల క్రితం కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి సంబంధించి 72 వేల కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలు, వడ్డీలను మాఫీ చేసిందని గుర్తు చేశారు.
తెలంగాణలో వ్యవసాయం మరింత లాభసాటిగా మారాలి.. అంతిమంగా రైతు సోదరులు ఆర్థికంగా బలపడడానికి రైతాంగానికి ఎల్లవేళలా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం దండుగ కాదు పండుగ అనే విధంగా పరిస్థితిని మారుస్తున్నామని రైతన్న కష్టాలు కడతేర్చాలని నడుంబిగించామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 60 శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నది. వ్యవసాయ రంగం బాగుంటేనే రాష్ట్ర ప్రజలు రాష్ట్ర బాగుంటుంది, వ్యవసాయ రంగం అభివృద్ధికి మించిన ప్రాధాన్యత ఈ ప్రభుత్వానికి మరొకటి లేదు. భవిష్యత్తులో వ్యవసాయాన్ని ఉజ్వలంగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ సంకల్పం. రాబోయే కాలంలో ప్రభుత్వం రైతులకు మరింత అండగా నిలుస్తుంది. రైతును రాజు చేయాలన్నది ప్రభుత్వ అంతిమ లక్ష్యం. ఈ లక్ష్యం చేరుకోవడానికి పంట రుణ మాఫీ పధకం ద్వారా రైతన్నలకు
మంచి ప్రారంభం లభించిందన్నారు.