నాలాలపై అక్రమ నిర్మాణాలు
* చోద్యం చూస్తున్న అధికారులు
* విద్యా నగర్ కాలనీలో ఇండ్లలోకి చేరుతున్న మురుగునీరు
* స్థానికుల గోడు పట్టించుకోని మిర్యాలగూడ మున్సిపల్ అధికారులు
* సమస్యలను పరిష్కరించాలని అభ్యర్థన, అక్రమ కట్టడాలను తొలగించాలని డిమాండ్
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. నల్లగొండ జిల్లాలో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఇప్పటికే అధికారులను అలర్ట్ చేశారు. నల్లగొండ జిల్లాలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులెవరూ సెలవుపై వెళ్లావొద్దని, ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కాగా, పలువురు అధికారులు జిల్లా కలెక్టర్ ఆదేశాలను సైతం బేఖాతర్ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

శనివారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా మిర్యాలగూడ పట్టణంలో సబ్ జైల్ రోడ్డులోని నాలా ఉధృతంగా ప్రవహిస్తున్నది. నాలాపై పలువురు వాణిజ్య సముదాయాలను ఏర్పాటు చేసుకొని వ్యర్థాలను నాలాలోనే పడేస్తున్నారు. దీని ఫలితంగా నాలా నీరు ప్రవహించకుండా సమీపంలో ఉన్న ఇండ్ల లోకి మురుగు కాలువల ద్వారా చేరుతున్నది. దీనితో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక ప్రజలు డెంగీ, మలేరియా, టైఫాయిడ్, విష జ్వరాలు పెబలుతున్న నేపథ్యంలో భయాందోళనకు గురవుతున్నారు. ఎలాంటి రాజకీయాలకు తలొగ్గకుండా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని
నాలాలపై నిర్మించిన అక్రమ కట్టడాలను మరోసారి పరిశీలించి తాఖీదులను జారీ చేసి అయినా సరే
తక్షణమే కూల్చివేయాలని మున్సిపల్ అధికారులను మొరపెట్టుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం సైతం నాలాలపై ఎలాంటి నిర్మాణాలున్నా నిష్పక్షపాతంగా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తొలగించాలని ఒకవైపు చెబుతున్నా మరోవైపు స్థానిక రాజకీయ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అక్రమ నిర్మాణాల జోలికి మున్సిపల్ అధికారులు వెళ్ళడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేగాకుండా, నాలాలపై చికెన్, మటన్ షాపులను ఏర్పాటు చేసుకున్న వ్యాపారులు వాటి వ్యర్థాలను నాలాల్లో విసిరివేయడం కారణంగా అవి పేరుకుపోతున్నాయి. దీని ఫలితంగా నాలాలోని నీరు ఇండ్లల్లోకి ప్రవేశిస్తున్నది. ఓ వ్యాపారి ఏకంగా నాలాలో ఇసుక బస్తాలను వేసి అతడి షాపు వద్దకు నీరు చేరకుండా కట్టడి చేసుకోవడం విస్మయానికి గురిచేస్తున్నది. ఇదే విషయమై గతవారం మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ కు స్థానికులు ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షం నేపథ్యంలో మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు. జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.