మావోయిస్టుల అలజడి…

*మావోయిస్టుల అలజడి… రంగంలోకి ఎస్పీలు*

ఆదిలాబాద్, అక్షిత ప్రతినిధి :

తెలంగాణా రాష్ట్రంలో మళ్లీ మావోయిస్టుల అలజడి కలకలం రేపుతోంది.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోకి మావోయిస్టుల దళం వచ్చిందన్న సమాచారంతో అడవులను జల్లెడ పడుతున్నారు పోలీసులు, గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా ఎస్పీలే రంగంలోకి దిగి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి. రెండు మండలాల్లోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టిన పోలీసులకు వారం రోజుల క్రితం తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని కైలాష్ టెక్డి సమీపంలో గ్రెనేడ్ లభించింది.దీంతో అప్రమత్తమైన పోలీసులు అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ క్రమంలో మావోయిస్టుల అనుమానాస్పద కదలికలను గుర్తించినట్లు తెలుస్తోంది.రెండేళ్ల తర్వాత ఆదిలాబాద్ జిల్లాలోకి మావోయిస్టులు ప్రవేశించినట్లు తెలుస్తోంది.

*మావోయిస్ట్ ల కదలికలతో ఆదిలాబాద్ అటవీ ప్రాంతంలో జోరుగా కూంబింగ్*

2020 సెప్టెంబరులో కదంబ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మరణించారని,మిగిలిన దళ సభ్యులు తప్పించుకుని ఛత్తీస్‌గఢ్ అడవులకు వెళ్లారని పోలీసులు అప్పట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే.ఆదిలాబాద్ అటవీ ప్రాంతంలో మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ దళం గత కొన్నేళ్లుగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడని, భాస్కర్ దళంలోని 10 మంది మావోయిస్టులపై పోలీసులు 95 లక్షల రివార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల మావోయిస్టుల కదలికలతో ఆదిలాబాద్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

*రంగంలోకి ఆదిలాబాద్, కొమురంభీమ్,నిర్మల్ జిల్లాల ఎస్పీలు*

ఆదిలాబాద్,కొమురంభీం, నిర్మల్ జిల్లాల ఎస్పీలు స్వయంగా రంగంలోకి దిగి ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటిస్తూ మావోయిస్టులకు సహాయం చేయవద్దని,మావోయిస్టుల కదలికలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. అంతేకాదు ఇంటింటికి తిరిగి ప్రతి ఇల్లు జల్లెడ పడుతున్నారు ఎస్పీలు. ఎవరూ మావోయిస్టుల మాయలో పడొద్దని,వారికి సహకరించవద్దని హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా వస్తే సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking