వజ్రోత్సవాలు వైభవంగా చేపట్టాలి
కలెక్టర్లకు సీఎస్ దిశానిర్దేశం
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ జాతీయ సమైఖ్య వజ్రోత్సవాల ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లు, ఎస్.పీ లు, పోలీస్ కమీషనర్లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణా జాతీయ వజ్రోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, దీనిలో భాగంగా, 16న జరిగే ర్యాలీ, సభకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలెక్టర్లు విస్తృత ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసి ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈనెల 14 వతేదీనుండి 18 వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ, ప్రయివేటు భవనాలను విధ్యుత్ దీపాలతో అలంకరించాలని పేర్కొన్నారు.
ఈనెల 17న హైదరాబాద్లో ప్రధాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, జిల్లా, మండల, గ్రామపంచాయతీ ప్రధాన కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేయాలన్నారు. హైదరాబాద్ లో జరిగే ఆదివాసీ, బంజారా భవన్ ల ప్రారంభోత్సవం అనంతరం జరిగే బహిరంగ సభకు పెద్ద ఎత్తున గిరిజనులను తరలించేందుకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 18న అన్ని జిల్లా కేంద్రాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, అదేరోజు స్వాతంత్య్ర సమరయోధులు, కళాకారులకు సన్మానాలు నిర్వహించాలన్నారు. తెలంగాణా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల కార్యక్రమాలన్నీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగేలా జిల్లా అధికారుల సమన్వయంతో పనిచేయాలని, తదనుగుణంగా ప్రణాళిక రూపొందించాలని డిజిపి మహేందర్రెడ్డి పోలీసు అధికారులను కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, అదనపు డీజీ ఎల్ అండ్ ఓ జితేందర్, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, పంచాయితీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, హ్యాండ్లూమ్ టెక్స్ టైల్స్ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధా ప్రకాష్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, ఉన్నత విద్యా శాఖ కమీషనర్ నవీన్ మిట్టల్, రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, జి.హెచ్.యం.సి కమీషనర్ లోకేష్ కుమార్, టీఆర్ అండ్ బి కార్యదర్శి శ్రీనివాసరాజు, పంచాయితీ రాజ్ కమీషనర్ హనుమంత రావు, ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సత్యనారాయణ, ఆర్టీసీ ఎండి సజ్జనార్, ఇంటర్ మీడియేట్ ఎడ్యుకేషన్ కమీషనర్ ఓమర్ జలీల్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.