పట్టణ ప్రగతి… దేశానికి తలమానికం
16 పట్టణాలకు స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 అవార్డులు
ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావు
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
“స్వయం పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో, పట్టణ ప్రగతి గుణాత్మక దిశగా సాగుతూ, దేశానికే ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు.
కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రంలోని 16 పట్టణ స్థానిక సంస్థలు అవార్డులు గెలుచుకోవడం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి కోసం చేస్తున్న కృషికి దర్పణంగా నిలిచిందని సీఎం అన్నారు.
గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్ కింద తెలంగాణ రాష్ట్రం పలు విభాగాల్లో 13 అవార్డులను గెలుచుకున్న విషయాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు.
పట్టణాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన నూతన పురపాలక చట్టంతో పాటు, విడతల వారీగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాలు సత్ఫలితాలనిచ్చాయని సీఎం అన్నారు.
పట్టణాల్లో మౌలికవసతుల కల్పన, పారిశుద్ధ్యం, పట్టణ హరిత వనాల ఏర్పాటు, గ్రీన్ కవర్ ను పెంచడం, నర్సరీల ఏర్పాటు, ఓడిఎఫ్ ల దిశగా కృషితో పాటు పలు అభివృద్ధి చర్యలు చేపట్టడం ద్వారా గుణాత్మక ప్రగతి సాధ్యమైందని సీఎం తెలిపారు.
పట్టణ ప్రగతి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ దేశానికి తెలంగాణను ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేసిన, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ ను, ఆ శాఖ ఉన్నతాధికారులను, సిబ్బందిని, భాగస్వాములైన అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులకు సీఎం అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వ ఆశయాల సాధన దిశగా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు ఇదే స్ఫూర్తితో ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగాలని సీఎం పిలుపునిచ్చారు.