పతాక అంచున…తెలంగాణ ప్రగతి

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు –
గవర్నర్ శ్రీమతి తమిళి సై గారి ప్రసంగం :

గౌరవ తెలంగాణ శాసనమండలి చైర్మన్ గారికి,
గౌరవ తెలంగాణ శాసనసభ స్పీకర్ గారికి,
గౌరవ శాసన మండలి మరియు శాసనసభా సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.

పుట్టుక నీది…
చావునీది..
బ్రతుకంతా దేశానిది
అని ప్రజాకవి, స్వాతంత్ర్య సమరయోధులు కాళోజీ నారాయణరావు గారు చెప్పినట్టు మన జీవితాలను దేశం కోసం అంకితం చేయాలి.

1. తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న సమ్మిళిత సమగ్రాభివృద్ధి యావత్ దేశానికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నది. ప్రతీరంగంలోనూ దేశం ఆశ్చర్యపోయే విధంగా అద్భుతమైన ప్రగతిని ఆవిష్కరిస్తూ పురోగమిస్తున్నది. ప్రజల ఆశీస్సులు, గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలనా దక్షత, ప్రజా ప్రతినిధుల నిరంతర కృషి, ప్రభుత్వ సిబ్బంది అంకితభావం వల్లనే తెలంగాణ అపూర్వ విజయాలను సాధించింది.


2. ఒకనాడు కరంటు కోతలతో అంధకారంలో కొట్టుమిట్టాడిన తెలంగాణ.. నా ప్రభుత్వం చేసిన అవిరళమైన కృషితో నేడు ఇరవై నాలుగు గంటల విద్యుత్ సరఫరాతో వెలుగు జిలుగుల రాష్ట్రంగా విరాజిల్లుతున్నది. వ్యవసాయం కుదేలైపోయి విలవిలలాడిన నేల.. నేడు దేశానికే అన్నంపెట్టే ధాన్యాగారంగా అవతరించింది. తాగునీటి కోసం తల్లడిల్లిన పరిస్థితుల నుంచి పూర్తిగా బయటపడి, వందశాతం గ్రామాల్లో ఇంటింటికీ ఉచితంగా నల్లాల ద్వారా స్వచ్ఛమైన సురక్షిత జలాలను సరఫరా చేస్తున్నది. ఒకనాడు పాడుబడినట్టున్న తెలంగాణ గ్రామాల రూపురేఖలు మారి, నేడు అత్యున్నత జీవన ప్రమాణాలతో ఆదర్శవంతంగా తయారయ్యాయి. పెట్టుబడులకు స్వర్గధామంగా, ప్రపంచస్థాయి సంస్థలకు గమ్యస్థానంగా, ఐటీరంగంలో మేటి రాష్ట్రంగా తెలంగాణ ప్రగతిపథంలో పరుగులు పెడుతున్నది. పర్యావరణ పరిరక్షణలోనూ, పచ్చదనం పెంపుదలలోనూ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకుంటున్నది.

3. తెలంగాణ రాష్ట్రాన్ని అగాధమైన పరిస్థితి నుంచి ఆదర్శవంతమైన పరిస్థితికి చేర్చే ప్రయత్నంలో నా ప్రభుత్వం అనేక సవాళ్లను దీటుగా ఎదుర్కొన్నది. అస్పష్టతలను చేధించింది. అవరోధాలను చాకచక్యంగా అధిగమించింది. ఎనిమిదిన్నరేళ్ల స్వల్ప వ్యవధిలో తెలంగాణ అనేక విజయాలను సాధించింది. దేశం నివ్వెరపోయే అద్భుతాలను ఆవిష్కరించింది. అత్యంత బలీయమైన ఆర్ధిక శక్తిగా, సంక్షేమం, అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా రూపుదాల్చింది.

ఆర్థిక వృద్ధి
4. 2014-15లో రాష్ట్ర ఆదాయం 62 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఉండగా, నా ప్రభుత్వం చేసిన గొప్ప కృషి వల్ల 2021 నాటికి 1 లక్షా 84 వేల కోట్ల రూపాయలకు పెరిగింది.
2014-15లో రాష్ట్ర తలసరి ఆదాయం సగటున 1,24,104 రూపాయలు ఉండగా, 2021-22 నాటికి 2 లక్షల 75 వేల రూపాయలకు పెరిగింది.
5. తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్నిరంగాల్లోనూ అభివృద్ధి గతంకన్నా రెట్టింపుస్థాయిలో జరిగింది. అన్నిరంగాల్లో పెట్టుబడి వ్యయాన్ని అధికంగా చేస్తూ అనూహ్యమైన ప్రగతిని సాధించినందుకు కారణమైన ప్రభుత్వాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.

 

వ్యవసాయరంగ అభివృద్ధి
6. చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా వ్యవసాయరంగంలో గొప్ప స్థిరీకరణను నా ప్రభుత్వం సాధించింది. భారతదేశ వ్యవసాయ రంగంలో నూతన చరిత్రను లిఖించింది. గతంలో దండుగని అందరూ ఈసడించిన వ్యవసాయాన్ని పండుగలా మార్చింది.
7. వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్తు సరఫరాతో రైతులలో భరోసా పెరిగింది. మిషన్ కాకతీయతో చెరువులను పునరుద్ధరించింది. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి కొత్త ఆయకట్టును ఆభివృద్ధిచేసింది. యుద్ధ ప్రాతిపదికన భారీ, మధ్యతరహా, చిన్న ప్రాజెక్టులను నిర్మించింది. విస్తృతంగా చెక్ డ్యాములను నిర్మించింది. నా ప్రభుత్వం మూడున్నరేళ్ల రికార్డు సమయంలో నిర్మించిన కాళేశ్వరం భారీ బహుళదశల ఎత్తిపోతల ప్రాజెక్టు మానవ నిర్మిత మహాద్భుతంగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.

8. తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన చారిత్రాత్మకమైన రైతుబంధు పథకం ప్రపంచవ్యాప్త ప్రశంసలు పొందింది. ఐక్యరాజ్య సమితి విశ్వవేదిక మీద ఈ పథకాన్ని కొనియాడింది. 75 ఏళ్ల భారతదేశ చరిత్రలో 65 లక్షల మంది రైతులకు 65 వేల కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని పంట పెట్టుబడి సాయం కింద అందించిన ఏకైక ప్రభుత్వం నా తెలంగాణ ప్రభుత్వమని నేను సగర్వంగా ప్రకటిస్తున్నాను.

9. రైతు బీమా పథకం ద్వారా నా ప్రభుత్వం 5 లక్షల రూపాయల జీవిత బీమాను రైతు కుటుంబాలకు అందిస్తున్నది. రైతులపై నయాపైసా భారం వేయకుండా ప్రీమియం మొత్తాన్ని ప్రతిష్టాత్మక ఎల్ఐసి సంస్థకు ప్రభుత్వమే చెల్లిస్తున్నది. రైతులకు ఇటువంటి బీమా సదుపాయం ప్రపంచంలో మరెక్కడా లేదని నేను ఘంటాపథంగా చెప్పగలను. అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అగత్యం లేకుండా నా ప్రభుత్వం బీమా మొత్తాన్ని రైతు మరణించిన 10 రోజులలోపే వారి కుటుంబాలకు అందజేస్తున్నది. తద్వారా రైతు సంక్షేమం పట్ల తనకుగల చిత్తశుద్ధిని ప్రకటిస్తున్నది.
10. 2014-15లో 68.17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి ఉండగా, నా ప్రభుత్వం తీసుకున్న వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమ చర్యల వల్ల, కల్పించిన వివిధ సౌకర్యాల వల్ల 2 కోట్ల 2 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుంది. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. తద్వారా రైతుకు అన్నిదశల్లోనూ అండదండగా నిలుస్తున్నది. మన రాష్ట్ర జి.ఎస్.డి.పి.లో 18.6 శాతం వ్యవసాయరంగం నుంచే సమకూరుతున్నది. రాష్ట్రంలో వచ్చిన వ్యవసాయ అభివృద్ధి గురించి దేశవ్యాప్తంగా నేడు రైతులు చర్చించుకుంటున్నారు.

విద్యుత్ రంగ విజయం
11. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడేనాటికి స్థాపిత విద్యుత్ సామర్థ్యం కేవలం 7,778 మెగావాట్లు మాత్రమే ఉండేది. నా ప్రభుత్వం చేసిన ఎనలేని కృషితో నేడు తెలంగాణ స్థాపిత విద్యుత్ సామర్థ్యం 18,453 మెగావాట్లకు పెరిగింది. 2014-15లో తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 1,356 యూనిట్లు మాత్రమే ఉండేది. 2021-22 నాటికి 2,126 యూనిట్లకు తలసరి విద్యుత్ వినియోగం పెరిగింది. రాష్ట్రం సాధించిన అద్భుతమైన ప్రగతికి ఇది ప్రబలమైన సూచిక.

మిషన్ భగీరథతో ప్రతి ఇంటికీ తాగునీరు
12. తాగునీటి కష్టాలకు సంపూర్ణమైన ముగింపునిచ్చిన రాష్ట్రంగా తెలంగాణ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించింది. మిషన్ భగీరథ బృహత్తర ప్రణాళికతో రాష్ట్రంలోని నూటికి నూరుశాతం ఆవాసాలకూ సురక్షితమైన తాగునీరు సరఫరా అవుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో ఫ్లోరైడ్ పీడ సంపూర్ణంగా అంతమై పోయిందని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ పార్లమెంటు వేదికగా ప్రకటించింది.

విప్లవాత్మక దళితబంధు పథకం
13. దళితజాతి స్వావలంబన కోసం నా ప్రభుత్వం విప్లవాత్మంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం యావత్ దేశానికి దిక్సూచిగా నిలిచింది. దేశ చరిత్రలో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దళితుల సంక్షేమం కోసం చేసిన మహోద్యమం అనంతరం అదే స్ఫూర్తితో విశాలమైన దృక్పథంతో దళితుల స్వావలంబన కోసం, సమగ్రాభివృద్ధి కోసం ఉద్యమ స్ఫూర్తితో కొనసాగుతున్న పథకం దళితబంధు.
14. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా దళిత కుటుంబానికి ఉపాధి కల్పన కోసం 10 లక్షల రూపాయల భారీ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉచిత గ్రాంటుగా నా ప్రభుత్వం అందిస్తున్నది.
ఆర్థిక సహాయానికి అదనంగా ప్రభుత్వం మరియు లబ్ధిదారుల భాగస్వామ్యంతో దళిత రక్షణనిధిని నా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆపత్సమయంలో దెబ్బతిన్న లబ్ధిదారుని కుటుంబాన్ని ఈ నిధి ఆదుకొని తిరిగి నిలబెడుతుంది.
అంతేగాకుండా, దళితులు లాభదాయక వ్యాపార రంగాల్లో ప్రవేశించడం కోసం ప్రభుత్వ లైసెన్సుల జారీలో ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేస్తున్నది.

అసహాయులకు ఆసరా
15. నా ప్రభుత్వం మానవీయమైన ప్రభుత్వం. పేదలకు, అసహాయులకు ఆసరా అందించే ప్రభుత్వం. నా ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూపేదలకిచ్చే వృద్ధాప్య పింఛన్ వయో పరిమితిని 57 సంవత్సరాలకు తగ్గించింది. ఒంటరి మహిళలు, దివ్యాంగులు, బోధకాలు బాధితులు, డయాలసిస్ రోగులు తదితర అసహాయులైన పేద ప్రజల జీవన భద్రత కోసం ఆసరా పెన్షన్లు అందిస్తూ.. ప్రభుత్వం భారీయెత్తున్న నిధులు వినియోగిస్తుంది.

గిరిజన సంక్షేమం :
16. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడివడి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన నేపథ్యంలో సామాజిక వర్గాల జనాభా నిష్పత్తిలో మార్పు చోటు చేసుకుంది. ఆ మార్పుకు అనుగుణంగా నా ప్రభుత్వం వారి రిజర్వేషన్ శాతాన్ని పెంపుదల చేసింది. సమైక్య రాష్ట్రంలో ఎస్టీల జనాభా దామాషాను అనుసరించి 6శాతం రిజర్వేషన్ అమలైంది. తెలంగాణ అవతరణ తర్వాత ఎస్టీల జనాభా దామాషా 10 శాతానికి పెరిగింది. ఆదివాసీ, గిరిజనులకు మాట ఇచ్చిన ప్రకారం నా ప్రభుత్వం వారి రిజర్వేషన్ ను 10 శాతానిక పెంచింది.
17. ఎస్టీ ప్రజల చిరకాల వాంఛ మా తండాలో మా రాజ్యం, మా గూడెంలో మా రాజ్యం. వారి ఆకాంక్షను సాకారం చేస్తూ, నా ప్రభుత్వం 500 జనాభా దాటిన 2471 గిరిజన తండాలకు, గూడాలకు గ్రామ పంచాయతీలుగా హోదాను కల్పించింది. దీంతో 3146 మంది గిరిజన బిడ్డలు సర్పంచులుగా స్థానిక పరిపానలలో సగర్వంగా తమ భాగస్వామ్యాన్ని పంచుకుంటున్నారు.

బీసీ వర్గాల సంక్షేమం :
గొల్ల కుర్మల సంక్షేమం
18. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు నా ప్రభుత్వం వెనుకబడిన వృత్తి పనులకు చేయూతనందిస్తున్నది. 11 వేల కోట్ల రూపాయల వ్యయంతో 7.3 లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీని భారీ ఎత్తున చేపట్టింది. నేడు దేశంలోకెల్లా మన రాష్ట్రంలోని గొల్ల కుర్మలే ఎక్కువ సంఖ్యలో గొర్రెలను కలిగిఉన్నారు. మాంసోత్పత్తిలో తెలంగాణ దేశంలోనే 5వ స్థానంలో నిలుస్తున్నది.

మత్స్యకారుల సంక్షేమం
19. రాష్ట్రంలోని చెరువులు, ప్రాజెక్టుల ద్వారా ఏర్పడిన నూతన జలాశయాల్లో, ఇతర నీటి వనరుల్లో నా ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నది. ఉచితంగా చేపలను జలాశయాల్లో పెంచి, వాటిని పట్టుకొని లబ్దిపొందే హక్కును మత్స్యకారులకేకల్పిస్తున్నది.

నేత కార్మికుల సంక్షేమం
20. దెబ్బతినిపోయిన చేనేత రంగాన్ని తిరిగి నిలబెట్టేందుకు ఎనిమిదిన్నరేళ్లుగా నా ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ చర్యలను చేపట్టింది. నేత కార్మికులకు, పవర్ లూమ్ కార్మికులకు చేతినిండా పని కల్పిస్తున్నది. ప్రతిఏటా బతుకమ్మ పండుగ సందర్భంగా పంపిణీ చేసే చీరల తయారీ ఆర్డర్లను వారికి అప్పగిస్తున్నది. చేనేత మిత్ర పథకం ద్వారా నూలు, రసాయనాల కొనుగోలుపై 50శాతం సబ్సిడీ ఇస్తున్నది. నేతన్నకు బీమా పథకం ద్వారా 5 లక్షల రూపాయల జీవిత బీమాను ప్రభుత్వం కల్పించింది. 100శాతం ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తున్నది.

గీత కార్మికుల సంక్షేమం
21. గౌడ సోదరుల సంక్షేమం కోసం నా ప్రభుత్వం వైన్ షాపుల కేటాయింపుల్లో 15శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నది. తాటి,ఈత చెట్లపై పన్నును రద్దు చేసింది. గత బకాయిలను మాఫీ చేసింది. ప్రమాదవశాత్తు మరణించిన గీత కార్మికుల కుటుంబాలకు 5 లక్షల పరిహారాన్ని అందిస్తున్నది. నీరాను సాఫ్ట్ డ్రింక్ గా ప్రవేశపెడుతున్నది. ఇందుకోసం నీరా ప్రాసెసింగ్ యూనిట్, నీరాకేఫ్ ను నిర్మించింది. ఇవి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి.

22. లాండ్రీలకు, సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను అందిస్తూ నా ప్రభుత్వం రజకులను, నాయీ బ్రాహ్మణులను ఆదుకుంటున్నది.
23. తెలంగాణ ఏర్పడక ముందు 19 బీసీ రెసిడెన్షియల్ విద్యాలయాలు మాత్రమే ఉండేవి. బీసీ వర్గాల విద్యాభివృద్ధి ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకొని నా ప్రభుత్వం బీసీ రెసిడెన్షియల్ విద్యాలయాల సంఖ్యను 310 వరకు పెంచింది.
24. హైదరాబాద్ నగరంలో 41 బీసీ కులాల కోసం ప్రభుత్వం ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తున్నది. వీటిలో కొన్ని భవనాలను త్వరలోనే ప్రారంభించుకోబోతున్నాం.

మహిళా సంక్షేమం :
25. ఒక దేశ ప్రగతికి ఆ దేశంలోని మహిళలు సాధించిన అభివృద్ధినే కొలమానంగా తీసుకుంటాను అని అన్నారు రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్.
నా ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం అత్యుత్తమమైన కార్యక్రమాలను అమలు చేస్తున్నది. ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా నూటికి నూరుశాతంఅంగన్వాడీ కేంద్రాల్లో పాలు, గుడ్లతో కూడిన పౌష్టికాహారాన్ని అందిస్తున్నది. ఆరోగ్యలక్ష్మి పథకం సేవలను నీతి ఆయోగ్ ఎంతగానో ప్రశంసించింది. అంగన్వాడీ టీచర్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోకెల్లా అత్యధికంగా పారితోషికాన్ని చెల్లిస్తున్న ది. ఆశా వర్కర్లకిచ్చే పారితోషికాన్ని 2 వేల నుండి 9750 రూపాయలకు నా ప్రభుత్వం పెంచింది. ప్రభుత్వోద్యోగులకు సమాంతరంగా అంతేస్థాయిలో వేతనాల పెరుగుదలను హోంగార్డులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తదితర సిబ్బందికి సైతం వర్తింపజేసింది. దేశంలోనే ప్రప్రథమంగా ఈ విధమైన సమన్యాయాన్ని పాటించిన మొట్టమొదటి ప్రభుత్వం నా తెలంగాణ ప్రభుత్వం.
26. సివిల్ పోలీసు ఉద్యోగాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ ను నా ప్రభుత్వం అమలు చేస్తున్నది. మహిళలపై వేధింపులకు పాల్పడే ఆకతాయిలను అరికట్టడం కోసం నా ప్రభుత్వం వినూత్నంగా ప్రవేశపెట్టిన షీ టీమ్స్ అద్భుతమైన పనితీరును కనబరుస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో కూడా తెలంగాణను ఆదర్శంగా తీసుకొని ఇదే విధమైన మహిళా పోలీస్ టీములను ఏర్పాటు చేస్తున్నారు.

కల్యాణలక్ష్మి / షాదీ ముబారక్
27. పేదింటి ఆడపిల్లల పెండ్లి ఖర్చుల కోసం నా ప్రభుత్వం కల్యాణ లక్ష్మి / షాదీ ముబారక్ పథకం ద్వారా 1 లక్షా 116 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నది. ఇప్పటివరకు 12 లక్షల 469 మంది ఆడపిల్లల కుటుంబాలకు లబ్ది చేకూరింది

మైనారిటీల సంక్షేమం
28. అన్ని మతాలను సమానంగా ఆదరిస్తూ నా ప్రభుత్వం అందరి విశ్వాసాన్ని చూరగొంటున్నది. తెలంగాణ ఏర్పడకముందు
మైనారిటీలు విద్యా విషయికంగా అభివృద్ధి చెందితేనే వారిలో వెనుకబాటుతనం తొలగిపోతుందనే బలమైన ఆశయంతో నా ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేనంతగా రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే 203 మైనారిటీ గురుకుల స్కూళ్లను ఏర్పాటు చేసింది. తరువాతికాలంలోవాటన్నింటినీ మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేసింది.
29. రంజాన్ క్రిస్టమస్ పండుగల సందర్భంగా ప్రభుత్వం ప్రత్యేక కానుకలను అందిస్తున్నది. బతుకమ్మ సందర్భంగా మహిళలకు చీరలను పంపిణీ చేస్తున్నది.
సకల జనుల సంక్షేమాన్ని బాధ్యతగా స్వీకరించిన నా ప్రభుత్వం పేద బ్రాహ్మణుల కోసం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ను ఏర్పాటు చేసింది. వివిధ పథకాల ద్వారా ఉపాధి కల్పనకు, విదేశాలలో చదువుకోవడానికి ఆర్ధిక సహాయం చేస్తున్నది.
30. జర్నలిస్టుల కోసం 100 కోట్లతో, న్యాయవాదుల కోసం 100 కోట్లతో సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ఆదుకుంటున్నది.
31. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులతో మైత్రీ భావంతో వ్యవహరిస్తున్నది. నేడు దేశంలో అత్యధిక స్థాయి వేతనాలను ప్రభుత్వం తెలంగాణ ఉద్యోగులకు అందిస్తున్నది.

ఉద్యోగ నియామకాలు
32. ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం ఏర్పడుతుందనే భయంతో అనేక అంతర్జాతీయ కంపెనీలు పెద్ద సంఖ్యలో తమ ఉద్యోగులను తొలగించి ఇంటికి పంపుతున్నాయి. ఇంత కష్టకాలంలోనూ నా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కొలువుల జాతర కొనసాగిస్తున్నది. ప్రస్తుతం ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నా 80,039 ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేస్తున్నది. వీటికి అదనంగా కాంట్రాక్టు ఉద్యోగుల సేవలను క్రమబద్దీకరించే ప్రక్రియ కొనసాగుతున్నది. ఉద్యోగాలు స్థానిక అభ్యర్థులకే 95శాతం దక్కే విధంగా లోకల్ క్యాడర్ వ్యవస్థను రూపొందించుకున్నాం. దీనికోసం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371-డి ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణను సాధించుకోగలిగాం. 2014 జూన్ నుంచి ఫిబ్రవరి 2022 దాకా ప్రత్యక్ష నియామకాల ద్వారా 1,41,735 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం 80,039 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది. మొత్తంగా నా ప్రభుత్వం 2,21,774 ఉద్యోగ నియామకాలు జరపడం తెలంగాణ చరిత్రలో ఒక అపురూపమైన ఘట్టం.

విద్యారంగ వికాసం
33. పేద విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధనతో పాటు తగిన ఆహారం వసతి ఏర్పాటు చేయాలనే ఉదాత్తమైన లక్ష్యంతో నా ప్రభుత్వం గురుకుల విద్యకు అమిత ప్రాధాన్యతనిచ్చింది. దేశంలో అత్యధికంగా వెయ్యికి పైగా గురుకులాలు కలిగిన ఒకే ఒక రాష్ట్రం మన తెలంగాణ కావడం మనం గర్వించదగిన విషయం. ఈ గురుకులాలలో ఉత్తమమైన శిక్షణను పొందిన పేదవర్గాల పిల్లలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభా పాటవాలను చాటుతున్నారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలలో ప్రవేశాలను సాధిస్తున్నారు.
34. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి మౌలిక వసతులను కల్పించాలని, తద్వారా రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని ప్రభుత్వం మన ఊరు – మన బడి / మన బస్తీ – మన బడి అనే బృహత్తర ప్రణాళికను అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా మూడుదశల్లో 7,289 కోట్ల వ్యయంతో 26,065 పాఠశాలల్లో 12 రకాల మౌలిక వసతులను కల్పిస్తున్నది.

ప్రజారోగ్యం
35. దేశంలో అత్యుత్తమ వైద్యసేవలందించే రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉందని నీతి ఆయోగ్ ప్రశంసించింది. రాష్ట్రంలోని అన్ని దవాఖానాల్లో ప్రభుత్వం మౌలిక వసతులను కల్పించింది. ఇప్పటివరకు 20 జిల్లాల్లో డయాగ్నస్టిక్సెంటర్లను నెలకొల్పింది. మరో 13 జిల్లాల్లో నెలకొల్పనున్నది. 104 డయాలసిస్సెంటర్లను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలోని అన్ని హాస్పిటళ్లలో ఆక్సిజన్ సదుపాయం కలిగిన బెడ్స్ ను ఏర్పాటు చేసింది.
హైదరాబాద్ నగరం నలువైపులా 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తున్నది. నిమ్స్ లో మరో 2 వేల పడకలను అదనంగా ఏర్పాటు చేస్తున్నది. వరంగల్ నగరంలో 1100 కోట్ల రూపాయల ఖర్చుతో 2 వేల బెడ్స్ సామర్థ్యంతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
36. రాష్ట్రం ఏర్పాటుకు ముందు తెలంగాణ ప్రాంతంలో మూడంటే మూడు వైద్య కళాశాలలు మాత్రమే ఉండేవి. ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో నా ప్రభుత్వం ముందుకు పోతున్నది. ఇప్పటికే 12 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే మరో 9 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి.
37. పట్టణాల్లోని పేదల కోసం ఏర్పాటు చేసిన 342 బస్తీ దవాఖానాలు చక్కని వైద్యసేవలందిస్తున్నాయి. వీటి స్ఫూర్తితో పల్లె దవాఖానాలను ప్రభుత్వం ప్రారంభిస్తున్నది. కేసీఆర్ కిట్స్, న్యూట్రిషన్ కిట్స్, ఆరోగ్య లక్ష్మి తదితర పథకాల వల్ల వివిధ ఆరోగ్య సూచీల్లో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన పురోగతిని సాధించింది.
38. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల రేటు 30శాతం మాత్రమే ఉండేది. నా ప్రభుత్వం ఆరోగ్యరంగంలో చేపట్టిన సమర్థవంతమైన చర్యల వల్ల నేడు 61 శాతానికి పెరిగింది. అదేవిధంగా మాతృ మరణాలు ప్రతి లక్ష ప్రసవాలకు 92 ఉండేవి. 2022 నాటికి 43 కు తగ్గిపోయాయి. 2014లో శిశు మరణాల రేటు ప్రతి వెయ్యి జననాలకు 39 ఉండగా, 2022 నాటికి 21 కి తగ్గిపోయాయి.

పల్లె, పట్టణ ప్రగతి
39. నా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామీణ జీవన ప్రమాణాలు గణనీయంగా పెరిగాయి. ప్రభుత్వం, స్థానిక సంస్థలు సమన్వయంతో చేసిన పటిష్టమైన కార్యాచరణతో గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతున్నాయి. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ, డంప్ యార్డు, నర్సరీలు, పల్లె ప్రకృతివనాలు, వైకుంఠధామం వంటి చక్కని మౌలిక వసతులు సమకూరాయి. అభివృద్ధి చెందిన గ్రామాలకు కేంద్రం ప్రకటించే అవార్డులను సాధించడంలో దేశంలో అన్ని రాష్ట్రాలకన్నా ముందంజలో ఉందని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను.
40. పట్టణ ప్రగతి కార్యక్రమంతో పట్టణాల్లోనూ పారిశుధ్య ప్రమాణాలు పెరిగినాయి. పురపాలక సంస్థల పనితీరు ఎంతో మెరుగుపడింది. పట్టణాల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పన జరిగింది. సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణం, పెద్ద సంఖ్యలో పబ్లిక్ టాయిలెట్స్నిర్మాణం, స్మశానాలను ఆధునిక వసతులు కలిగిన వైకుంఠధామాలుగా మార్చడం వంటి అనేక మౌలిక వసతులను ప్రభుత్వం కల్పించింది.

హరితహారం
41. పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడటం కోసం ప్రభుత్వం తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ఒక పవిత్ర యజ్ఞంలా కొనసాగిస్తున్నది. ప్రజలు ఉద్యమ స్ఫూర్తితో భాగస్వాములవుతున్నారు. నేడు తెలంగాణలోని ప్రతి గ్రామం ఆకుపచ్చదనంతోఅలరారుతున్నది. తెలంగాణలో గ్రీన్ కవర్ 7.7శాతం పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా తన నివేదికలో పేర్కొన్నది. హైదరాబాద్ నగరం ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ గా గుర్తింపును పొందింది.

పారిశ్రామిక, ఐటీ రంగాల అభివృద్ధి
42. పారిశ్రామిక, ఐటీ రంగాల అభివృద్ధి కోసం నా ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్-ఐపాస్ చట్టం విప్లవాత్మకమైన పురోగతికి కారణమైంది. 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా, మెరుగైన శాంతిభద్రతల నిర్వహణ వంటి కారణాల వల్ల రాష్ట్రానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. పారిశ్రామిక ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. కార్మికులకు ఉపాధి పెరిగింది. గత ఎనిమిదిన్నరేండ్లుగా పారిశ్రామిక మరియు ఐటీ రంగాల్లో 3 లక్షల 31 వేల కోట్లకు పైగా పెట్టుబడులను తెలంగాణ ఆకర్షించగలిగింది. ఐటీ ఉద్యోగ నియామకాల్లో 140శాతం వృద్ధి ఉంది.

వైభవంగా యాదగిరి ఆలయ పునర్నిర్మాణం
43. యాదగిరి దేవాలయ పునర్నిర్మాణం ఒక చారిత్రాత్మక అద్భుతం. తెలంగాణ ప్రజల కొంగుబంగారమైన యాదగిరి నరసింహస్వామి దేవాలయాన్ని నా ప్రభుత్వం వైభవోపేతంగా పునర్నిర్మించింది. అడుగడుగునా ఆధ్యాత్మిక భావం వెల్లివిరిసేలా దేవాలయాన్ని తీర్చిదిద్దింది.

నూతన సచివాలయ భవనానికి అంబేద్కర్ పేరు
44. తెలంగాణ రాష్ట్ర పరిపాలనా ప్రతిపత్తికి సంకేతంగా నా ప్రభుత్వం నూతనంగా నిర్మించిన సచివాలయ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పేరును పెట్టినందుకు నేను సభాముఖంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. పరిపాలన మరింత ప్రభావ పూరితంగా సాగేందుకు ఈ భవనంలో అంతర్జాతీయ ప్రమాణాలతో అధునాతన వసతులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
45. అంబేద్కర్ మహాశయుని ఔన్నత్యాన్ని ప్రతిఫలించే విధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగులు అంబేద్కర్ విగ్రహాన్ని నా ప్రభుత్వం ప్రతిష్ఠించబోతున్నదని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. అలాగే, సచివాలయానికి అభిముఖంగా నిర్మించిన అమరవీరుల స్మారక కేంద్రం ప్రారంభానికి సిద్ధంగా ఉంది.
46. పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు నా ప్రభుత్వం రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా పునర్విభజించింది. విశాలంగా సకల మౌలిక వసతులతో, జిల్లాకేంద్రంలోనిఅన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట ఉండే విధంగా నూతనంగా సమీకృత కలెక్టరేట్ భవనాలను ప్రభుత్వం ఘనంగా నిర్మించింది.

పటిష్టంగా శాంతి భద్రతల పరిరక్షణ
47. శాంతి భద్రతల పరిరక్షణను పటిష్టంగా అమలు చేస్తుండటం వల్ల రాష్ట్రంలో పౌరజీవనం ప్రశాంతంగా సాగుతున్నది. రాష్ట్రంలో నిఘా వ్యవస్థను పటిష్టం చేస్తూ దేశంలోనే అత్యధికంగా 9.8 లక్షల సీసీ కెమెరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసి, నేరాల నియంత్రణలో దేశంలోనే ముందున్నది. విపత్తుల సందర్భంలో నియంత్రణ, సహాయ కార్యక్రమాల సమన్వయం కోసం ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రపంచస్థాయిపోలీసింగ్ వ్యవస్థకు తార్కాణం.

సంక్షేమం, అభివృద్ధి జోడుగుర్రాలుగా నా ప్రభుత్వం ప్రగతి పథంలో వేగంగా పయనిస్తున్నది. ఎనిమిదిన్నరేళ్ల వయసున్న తెలంగాణ రాష్ట్రం యావత్ దేశానికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నది. తెలంగాణ అభివృద్ధి మోడల్ గురించిన చర్చ దేశవ్యాప్తంగా జరుగుతున్నది. ఇదే స్ఫూర్తితో, ఇదే నిబద్ధతతో నా ప్రభుత్వం ముందుకు సాగుతుందని ప్రజలకు హామీనిస్తున్నాను.
‘కరువంటూ.. కాటకమంటూ కనిపించని కాలాలెపుడో
పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో..’ అని తెలుగు కవి, స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ దాశరథి కృష్ణమాచార్యులు చెప్పారు.
కరవు, ఆకలి లేని ప్రపంచం కోసం, భవిష్యత్ తరాల స్వప్నాలు సాకారమయ్యే ప్రపంచం కోసం మనమంతా కృషి చేద్దాం..

జై తెలంగాణ.. జై హింద్

Leave A Reply

Your email address will not be published.

Breaking