వనమహోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన నాగార్జున పాఠశాల
రామన్నపేట అక్షిత ప్రతినిధి
పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా నాగార్జున పాఠశాల ఆధ్వర్యంలో లచ్చిరెడ్డిగూడెంలో శనివారం వనమహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది కలిసి పాఠశాల ఆవరణలో మరియు పరిసర ప్రాంతాల్లో పలు రకాల మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు మొక్కల ప్రాముఖ్యత, పర్యావరణ సమతుల్యతలో వాటి పాత్ర, భవిష్యత్ తరాలకు పచ్చని ప్రకృతిని అందించాల్సిన బాధ్యతపై అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించి పెద్ద చెట్టుగా తీర్చిదిద్దాలని ప్రతిజ్ఞ చేశారు.ఈ సందర్భంగా నాగార్జున స్కూల్ కరస్పాండెంట్ డా. ఎన్. నాగరాజు మాట్లాడుతూ, “చెట్లు భూమికి ఊపిరితిత్తులు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా ప్రతి పౌరుడి బాధ్యత. విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయి. పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలి” అని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.