అలుపెరగని యోధులకు
సముచితమైన నివాళి
ఎగ్జిబిషన్ను ప్రారంభించిన సెంట్రల్ యూనివర్సిటీ, ఉర్దూ యూనివర్సిటీ ఉపకులపతిలు
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
హైదరాబాద్ విమోచన దినోత్సవం వేడుకలు జరుపుకోవడం నాటి నిజాం పాలకులకు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేసిన వారికి సముచితమైన నివాళి అని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ బసుత్కర్ జగదీశ్వర్ రావు, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఉపకులపతి ఫ్రొఫెసర్ సయ్యద్ ఐనుల్ హసన్ సంయుక్తంగా తెలిపారు.
శుక్రవారం సికింద్రాబాద్ బొల్లారం రాష్ట్రపతి నిలయంలో హైదరాబాద్ విమోచన దినోత్సవం పురస్కరించుకొని సెప్టెంబర్ 15 నుంచి 17వ తేది వరకు కేంద్ర సమాచార,ప్రసార మంత్రిత్వ శాఖ కు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ హైదరాబద్ విభాగం ఏర్పాటు చేసిన తెలంగాణ స్వాతంత్ర్య ఉద్యమం ఛాయ చిత్ర ప్రదర్శన, అప్పటి రాష్ట్ర స్వాతంత్ర్య సమరయోధులు ప్రదర్శనను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉపకులపతి
ప్రొఫెసర్ బసుత్కర్ జగదీశ్వర్ రావు, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఉపకులపతి ఫ్రొఫెసర్ సయ్యద్ ఐనుల్ హసన్ సంయుక్తంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….తెలంగాణ ప్రజలు చరిత్రను తెలుసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రజలపై జరిగిన వేధింపులను మర్చిపోలేమని చెప్పారు. ఆనాడు తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రజలపై జరిగిన అకృత్యాలు, అఘాయిత్యాలను మర్చిపోలేమని చెప్పారు. నిజాం పాలనలో పరకాలలో 22 మందిని కాల్చి చంపిన ఘటనను గుర్తు చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు అనేకం ఆనాడు చోటు చేసుకున్నాయన్నారు. ఈ తరహ ఘటనలను ఎలా మర్చిపోతామని ప్రశ్నించారు. ఈ ఘటనల్లో చనిపోయినవారు మన సోదరులు, సోదరీమణలని చెప్పారు. ఇంత మంది త్యాగాలు చేయడంతో సెప్టెంబర్ 17వ తేదీన హైద్రాబాద్ విమోచనం పొందిందన్నారు. అందుకే ఆ రోజును విమోచన దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. ఈ తరం యువత ఆనాడు చోటు చేసుకున్న ఘటనల గురించి తెలుసుకోవాలన్నారు. రజాకారు మూకలు ఈ దాడులు చేశారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ సమాజ అభివృద్ధికి తోడ్పడాలన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి నిలయం పాలన వ్యవహారాల అధికారిణి రజినిప్రియ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ డిప్యూటీ డైరెక్టర్ కరీనాబి తెంగమామ్, అసిస్టెంట్ డైరెక్టర్ హరిబాబు, ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ ధర్మ నాయక్, ఫీల్డ్ ఎగ్జిబిషన్ అసిస్టెంట్ ఆర్థ శ్రీనివాస్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.