టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి?

*టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి?

*ఆయనతో పాటు మరో ఇద్దరి పేర్లు పరిశీలించిన స్క్రీనింగ్‌ కమిటీ*

*గవర్నర్‌ ఆమోదానికి ప్రభుత్వ సిఫారసు*

*హైదరాబాద్‌, అక్షిత ప్రతినిధి :

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) ఛైర్మన్‌గా విశ్రాంత ఐపీఎస్‌ అధికారి నియమితులయ్యే అవకాశం ఉందని విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ పదవికి మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు మరో ఇద్దరి పేర్లను స్క్రీనింగ్‌ కమిటీ పరిశీలించినట్లు తెలిసింది. వారిలో మహేందర్‌రెడ్డికే ఎక్కువ అవకాశాలున్నట్లు సమాచారం. గతంలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో టీఎస్‌పీఎస్సీపై పెద్దఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్షలను పారదర్శకంగా, కట్టుదిట్టంగా నిర్వహించాలని నిర్ణయించిన సీఎం రేవంత్‌రెడ్డి ఛైర్మన్‌ బాధ్యతలను విశ్రాంత ఐపీఎస్‌కు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఛైర్మన్‌, సభ్యుల నియామకాలకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. ఛైర్మన్‌ పదవి కోసం 50 మంది, సభ్యుల కోసం 321 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, సాధారణ పరిపాలన శాఖ(సర్వీసెస్‌) కార్యదర్శి నిర్మలతో కూడిన స్క్రీనింగ్‌ కమిటీ సోమవారం సచివాలయంలో సమావేశమై దరఖాస్తులను పరిశీలించింది. ఛైర్మన్‌ పదవి కోసం మహేందర్‌రెడ్డితో పాటు ఓ విశ్రాంత అధికారి, రెండు నెలల్లో పదవీ విరమణ చేయనున్న మరో ఐపీఎస్‌ అధికారి పేర్లను ఎంపిక చేసినట్లు సమాచారం. వీరిలో మహేందర్‌రెడ్డి ఒక్కరే తెలంగాణకు చెందినవారు కావడంతో ఆయన నియామకానికే ఎక్కువ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ నియామకానికి సంబంధించిన దస్త్రాన్ని గవర్నర్‌ తమిళిసై ఆమోదం కోసం ప్రభుత్వం పంపించినట్లు తెలుస్తోంది.*

Leave A Reply

Your email address will not be published.

Breaking