సమిష్టి సహకారంతో
సమర్ధవంతoగా విధులు
– ఉద్యోగ విరమణలో సమాచారశాఖ అదనపు సంచాలకులు నాగయ్య కాంబ్లే
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
అధికారులు, ఉద్యోగుల సహకారంతో ఉద్యోగ బాధ్యతలను విజయవంతoగా నిర్వర్తించానని సమాచారశాఖ అదనపు సంచాలకులు నాగయ్య కాంబ్లే తెలిపారు. ప్రస్తుతం సమాచార శాఖ ప్రధాన కార్యాలయంలో అదనపు సంచాలకులుగా విధులు నిర్వర్తిస్తున్న నాగయ్య కాంబ్లే బుధవారం ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా హైదరాబాద్ రాష్ట్ర సమాచార శాఖ కార్యాలయంలో ఆ శాఖ పూర్వ కమిషనర్ హనుమంత రావు, ప్రస్తుత కమీషనర్ హరీష్, అధికారులు ఉద్యోగుల ఆయనను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సమాచారశాఖ అదనపు సంచాలకులు నాగయ్య కాంబ్లే మాట్లాడుతూ తన 39 ఏండ్ల ఉద్యోగ జీవితంలో డివిజన్ పౌర సంభంధాల అధికారి నుండి అదనపు సంచాలకుల వరకు వివిధ హోదాలలో పలు జిల్లాలో పని చేశానన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి చేరే వేసే క్రమంలో అటు అధికారులు ఇటు మీడియాను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగానన్నారు.

ఐఅండ్ పిఆర్ కమీషనర్ హరీష్ మాట్లాడుతూ
సమాచార శాఖలోసుదీర్ఘ కాలం పాటు విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులను, కఠిన పరిస్థితులను ఎదుర్కొని ఉద్యోగ బాధ్యతలను విజయవంతంగా ముగించడం గొప్ప విషయమన్నారు.ఎలాంటి ఆరోపణలు లేకుండా ప్రభుత్వ పథకాలకు విస్తృత ప్రచారం చేశారని కొనియాడారు. నిబద్దత, అంకితభావంతో బాధ్యతాయుతంగా సమాచార శాఖకు అందించిన సేవలను శాఖ ఎప్పటికి గుర్తుంచుకుంటుందన్నారు.

భవిష్యత్తులో శాఖకు ఏవైనా సలహాలు సూచనలు అవసరమైతే సంప్రదిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ డిసి ఈడి ఎల్.కిషోర్ బాబు, సంయుక్త సంచాలకులు డిఎస్ జగన్, కన్నెగంటి వెంకటరమణ, డి.శ్రీనివాస్, ఉప సంచాలకులు వై. వెంకటేశ్వర్లు, ప్రసాద్, హష్మీ , సమాచార శాఖ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.