గిరిజన బిడ్డ శంకర్ నాయక్ కు కిరీటం
ఎమ్మెల్సీ అభ్యర్థులుగా శంకర్ నాయక్, అద్దంకి దయాకర్, విజయశాంతిలు ఖరారు
మిర్యాలగూడ మార్చి 9 అక్షిత ప్రతినిధి :
నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కేతవత్ శంకర్ నాయక్ ను శాసనసభ కోటా నుండి జరిగే శాసనమండలి సభ్యుల పోటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిర్ణయాన్ని ఎఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రకటించారని టిపిసీసీకి పంపిన లేఖలో ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి కె సి వేణుగోపాల్ పేర్కొన్నారు.

ఆయనతో పాటు ఎస్సీ నుండి అద్దంకి దయాకర్, బిసి నుండి సిని నటి విజయశాంతి లను అభ్యర్థులుగా నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఒక స్థానాన్ని సిపిఐ అధిష్ఠానం కేటాయిస్తున్నట్లు తెలిపారు. మిర్యాలగూడ శాసనసభ నియోజకవర్గంలోని దామరచర్లలోనీ డిలావర్ పూర్ గ్రామపంచాయతీ నవంబర్ 15, 1972లో జన్మించారు.

ఆయనతంద్రి వీర్యనాయక్ ఆ గ్రామ సర్పంచ్ గా పని చేశారు. శంకర్ నాయక్ యువజన కాంగ్రెస్ కార్యకర్తగా రాజకీయాల్లో అడుగు పెట్టి 1998 నుండి 2001 వరకు మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా,2001 నుండి2005 వరకు ఉమ్మడి దామరచర్ల మండల జెడ్పిటీసీగా, 2006 నుండీ 2011 వరకు దామరచర్ల మండల పరిషత్ అధ్యక్షుడిగా, 2011 నుండి 2014 వరకు దామరచర్ల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, 2016 నుండీ 2019 వరకు మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు, 2019 నుండి నేటి వరకు నల్లగొండ డిసిసి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. వివాద రహితంగా ఉంటూ రాజకీయ గురువు మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ఆశీస్సులతో శంకర్ నాయక్ ముందుకు సాగుతున్నారు. ఆయన ఎంపిక నియోజకవర్గం గిరిజనులు సంబరాలు జరుపుకున్నారు.శంకర్ నాయక్ ఎమ్మెల్సీ ఖరారు పట్ల ఎన్ఎస్ యూఐ రాష్ట్ర నాయకులు బొంగర్ల వినోద్ హర్షం వ్యక్తం చేశారు.