బ్యారేజీల రిపేర్లకు    పక్కా ప్రణాళికలు

బ్యారేజీల రిపేర్లకు
   పక్కా ప్రణాళికలు

రిపేర్ల బాధ్యత
    ఏజెన్సీలదే

అన్ని డ్యామ్‌లపై
స్టేటస్ రిపోర్ట్

తుమ్మిడిహట్టి నుంచి
సుందిళ్లకు నీరు

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

అన్ని ప్రాజెక్టుల బ్యారేజీల రిపేర్లకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తుమ్మిడిహట్టి దగ్గర చేపట్టాల్సిన ప్రాజెక్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులకి సీఎం పలు కీలక సూచనలు చేశారు. తుమ్మిడిహట్టి నుంచి సుందిళ్ల వరకు 80టీఎంసీల నీటిని తరలించేందుకు.. ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగు, తాగు నీరు అందించాలని మార్గనిర్దేశం చేశారు. తుమ్మిడిహట్టి దగ్గర పాత పనులను ఉపయోగించుకుంటూ.. అంచనాలను తయారు చేయాలని సీఎం సూచించారు.

సుందిళ్లకి రిపేర్ చేసి వినియోగంలోకి తీసుకొచ్చి శ్రీపాద ఎల్లంపల్లికి నీటిని తీసుకువచ్చేందుకు అవసరమైన ప్రణాళికలు, అంచనాలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆజ్ఞాపించారు. సీఆర్ పాటిల్‌ లేఖపై చర్చ జరిగింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌కి ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి ఇటీవల లేఖ రాశారు. ఈ లేఖపై మంగళవారం జరిగిన సమీక్షలో ఉన్నతాధికారులతో రేవంత్‌రెడ్డి చర్చించారు. సీఆర్ పాటిల్‌‌కి తాను రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలను అధికారులకు సీఎం వివరించారు. తుమ్మిడిహట్టిపై ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ లేఖలో పేర్కొన్న ప్రాజెక్టులకు సంబంధించి… ప్రాజెక్టుల వారీగా అధ్యయనం చేసి పూర్తిస్థాయి నివేదికలను తయారు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని డ్యామ్‌లపై స్టేటస్ రిపోర్ట్ తయారు చేయాలని సూచించారు. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల పరిస్థితిపైన సీఎం చర్చించారు. బ్యారేజీల రిపేర్లకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఇందుకు సంబంధిత ఏజెన్సీలే బాధ్యత వహించేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆయా ప్రాజెక్టుల వారీగా పూర్తిస్థాయి నివేదికల ఆధారంగా తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై నవంబర్ రెండో వారంలో మరోసారి సమీక్షా సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking