నేషనల్ హైవేపై మృత్యుఘోష..
ద్వారకుంట వద్ద ఘోర బస్సు ప్రమాదం..
ఆరుగురు మృతి… పలువురికి గాయాలు
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల దిగ్బ్రాంతి
కోదాడ, అక్షిత ప్రతినిధి :
హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట శివారులో హైదరాబాద్ నుంచి ఏలూరు వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రహదారి పక్కన ఆగి ఉన్న కంటైనర్ లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం.సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిలు ప్రగాఢ సానుభూతి తెలిపారు.గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సీఎస్ ను ఆదేశించారు.

ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఢీకొన్న తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. కొంతమంది ప్రయాణికులు సీట్ల మధ్య ఇరుక్కుపోవడంతో పోలీసులు, అత్యవసర సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి వారిని బయటకు తీసుకువచ్చారు.

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం కారణంగా హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదానికి బస్సు అతివేగమా, డ్రైవర్ నిర్లక్ష్యమా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులు, క్షతగాత్రుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.