గురువులే విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శకులు
– ప్రిన్సిపల్ బొడిగె విజయకుమార్
రామన్నపేట అక్షిత ప్రతినిధి
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని సౌమ్య విద్యామందిర్ పాఠశాల ప్రిన్సిపల్ బొడిగె విజయకుమార్ అన్నారు. చిన్నకాపర్తి గ్రామంలోని సౌమ్య విద్యామందిర్ పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని శనివారం గురుపూజోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాలను బోధించడం మాత్రమే కాకుండా, మంచి విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత, నైతికతను అలవర్చడంలో ఉపాధ్యాయులు ఆదర్శంగా నిలవాలని అన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, వారికి సరైన మార్గనిర్దేశం చేస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేయవచ్చని పేర్కొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తికి, విద్యారంగానికి చేసిన సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించి గురుపూజోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రుద్రారపు లావణ్య, మునుకుంట్ల వేణు, మునుకుంట్ల స్వాతి, గండమల్ల చర్విత, రేగులగడ్డ ప్రశాంతి, సురోజు హర్షిణి, విద్యార్థులు పాల్గొన్నారు.