ఓవర్టేక్ చేస్తుండగా ప్రమాదం.. ఉపాధ్యాయుడి మృతి
డిచ్పల్లి వద్ద కారు అదుపుతప్పి బోల్తా..మరో ముగ్గురికి గాయాలు
లోకేశ్వరం, సెప్టెంబర్ 10 అక్షిత న్యూస్ :
ఆయిల్ ట్యాంకర్ను ఓవర్టేక్ చేసే క్రమంలో కారు అదుపుతప్పి ప్రమాదానికి గురై ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందాడు. ఈ ఘటన గురువారం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి సమీపంలోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.లోకేశ్వరం మండలం మన్మద్ గ్రామానికి చెందిన పైడిపల్లి భోజన్న,(48) నిర్మల్లో నివాసముంటూ కంజర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. స్నేహితుడు విదేశాలకు వెళ్తుండటంతో బుధవారం రాత్రి మరో ముగ్గురితో కలిసి కారులో శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లారు. స్నేహితుడిని విమానాశ్రయంలో దింపి గురువారం ఉదయం తిరుగు ప్రయాణమయ్యారు.డిచ్పల్లి సమీపంలో ఆయిల్ ట్యాంకర్ను ఓవర్టేక్ చేస్తుండగా కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైనట్లు సమాచారం. ఈ ఘటనలో డ్రైవర్ పక్కన కూర్చున్న భోజన్న తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. డిచ్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు…