భారత వజ్రోత్సవాలకు సిద్దమవ్వాలి

ఆగస్ట్ 8 నుంచి 22 వరకు ఉత్సవాలు

అన్ని శాఖలు సమన్వయంతో చేయాలి

అధికారులకు సీఎస్ దిశానిర్ధేశం

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

ఆగస్టు 8వ తేదీ నుండి 22వ తేదీ వరకు స్వాతంత్ర భారత వజ్రోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ అన్నారు. బీ.ఆర్‌.కే.ఆర్ భవన్‌ లో స్వాతంత్ర భారత వజ్రోత్సవాల నిర్వహణపై నేడు ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని కోరారు.
వజ్రోత్సవ ఉత్సవాలపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ ఇప్పటికే రోజువారీ కార్యక్రమాలను రూపొందించిందని ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. ఆగస్టు 8వ తేదీన జరిగే ప్రారంభోత్సవ సభకు మంత్రులు, ఎంపీ లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారని అన్నారు. దేశ సమైక్యతా, దేశ భక్తి ని పెంపొందించే ప్రత్యేక కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాలలో అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయాలని అన్నారు.
రాష్ట్రంలో ఇంటింటికీ పంపిణీ చేసేందుకు ఇప్పటికే కోటి జెండాలను సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. అన్ని గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీల్లో జెండాలు పంపిణీ చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా అన్ని సినిమా థియేటర్లలో పాఠశాల విద్యార్థులకు జాతీయ సమైక్యత, దేశభక్తిని పెంపొందించే చలన చిత్రాలను ఉచితంగా ప్రదర్శించనున్నట్టు వివరించారు.
ఈ సమావేశంలో సిఎం ఓఎస్‌డి దేశపతి శ్రీనివాస్ , మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా , ఐ.టి. శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ , జి.ఎ.డి. పొలిటికల్ కార్యదర్శి శేషాద్రి, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ బి.రాజమౌళి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, TSIIC MD నరసింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking