ఇబ్రహీంపట్నంలో భూ దందా
ఇబ్రహీంపట్నం ఖల్స ప్రభుత్వ భూమిలో
అక్రమ నిర్మాణాలు ?
అనుమతులు ఓ చోట.. కట్టేది మరో చోట
విచారణ చేసి చర్యలు తీసుకుంటాం
తహసీల్దార్ రామ్మోహన్
రంగారెడ్డి, అక్షిత ప్రతినిధి :
ఖాళీ జాగా కన్పిస్తే ఖబ్జా చేయొచ్చు. కళ్లెం వేయాల్సిన అధికారులు కాసులకు కక్కుర్తిపడి కబ్జాదారులకు అండగా నిలుస్తుండ్రు. అధికారులు, ప్రజా ప్రతినిధుల అండ ఉంటే కొండను మింగేయొచ్చు. ప్రభుత్వ భూములను కాజేయేచ్చు. అసైన్డ్, ఖల్సా, చెర్వు శిఖం,పోరంబోకు, చివరకు నాలా భూములను అక్రమించవచ్చు. ఆక్రమణలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. భూముల ధరలకు రెక్కలొచ్చాయి. అత్యాధునిక సదుపాయాలతో రంగారెడ్డి కలెక్టరేట్ ఇబ్రహీంపట్నంకు కూత వేటు దూరంలో ఉండడంతో ఇక్కడి భూముల ధరలు ఆకాశానంటుతున్నాయి. ఇదే అదునుగా భావించిన కొందరు భూ ఆక్రమణలకు పెట్రేగి పోతుండ్రు. వివరాల్లోకి వెళితే..ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపట్నం ఖల్సలోని సర్వేనంబర్ 1146 లో ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని మంగల్ పల్లి, శేరిగూడ గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. పట్టా భూమి ఒక
చోట ఉంటే ఆ భూమిలో అనుమతులు తీసుకోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మంగల్ పల్లి సమీపంలో భారత్ ఇంజనీరింగ్ కళాశాల పక్కనే ప్రభుత్వ భూమి ఉంది. ఆ భూమిలో కొందరు వ్యక్తులు నిర్మాణాలు చేపడుతున్నారు. వెంటనే ఆ అక్రమనిర్మాణాలు నిలిపి వేసి ప్రభుత్వ భూమిని కాపాడాలని మంగల్ పల్లి,శేరిగూడ, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ప్రజలు కోరుతున్నారు.
విచారించి అక్రమ నిర్మాణాలు తొలగిస్తాం
తహసీల్దార్ రామ్మోహన్

ఇబ్రహీంపట్నం ఖాల్సాలోని ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్లు నా దృష్టికి వచ్చిందని స్థానిక తహసీల్దార్ రామ్మోహన్ అక్షిత ప్రతినిధితో తెలిపారు. విచారణ జరిపి ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.