ఉద్యమకారుడి బిడ్డకు
సీఎం కేసీఆర్ చే నామకరణం
ప్రగతి భవన్ లో సాంప్రదాయ పద్దతిలో
ఆతిధ్యమిచ్చి బట్టలు పెట్టి ఆశీర్వదించిన
ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు
బిడ్డ చదువు కోసం ఆర్ధిక సాయం
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
తమ బిడ్డకు పేరు పెట్టుకోవాలనే ఆ తల్లిదండ్రుల తొమ్మిదేండ్ల కల సిఎం కెసిఆర్ గారి చేతుల మీదుగా ఫలించింది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన భూపాలపల్లి మండలం, నందిగామ గ్రామానికి చెందిన సురేశ్ అనిత దంపతులు 2013 లో ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. తమ బిడ్డకు నాటి ఉద్యమ రథసారథి నేటి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారితోనే నామకరణం చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ ఆడపిల్లకు ఇప్పటిదాకా పేరుపెట్టకుండానే పెంచుకుంటూ వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ స్పీకర్, స్థానిక నేత , ఎమ్మెల్సీ మధుసూధనాచారి చొరవ తీసుకుని, తల్లిదండ్రులను బిడ్డను ప్రగతి భవన్ కు తోడ్కొని వచ్చారు.
విషయం తెలసుకున్న సీఎం కేసీఆర్ దంపతులు, సురేష్ అనిత దంపతులను దీవించి వారి తొమ్మిదేండ్ల ఆడబిడ్డకు..‘మహతి ’ అని నామకరణం చేసారు. తమ ఇంటికి వచ్చిన వారికి స్వయంగా సీఎం దంపతులు బట్టలు పెట్టి సాంప్రదాయ పద్దతిలో ఆథిత్యమిచారు. బిడ్డ చదువుకోసం ఆర్థిక సాయాన్నందించారు. తమ తొమ్మిదేండ్ల కల ఫలించడమే కాకుండా, వూహించని రీతిలో తమను ఆదరించి దీవించిన తీరుకు, సురేష్ కుటుంబం సంబ్రమాశ్చర్యాలకు లోనయ్యింది. ఈ సందర్భంగా వారు సీఎం దంపతులకు తమ కృతజ్జతలు తెలుపుకున్నారు.