మత సామరస్యానికి ప్రతీక ‘తెలంగాణ’
* మైనారిటీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి
* బాలికల మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ లో జాతీయ విద్యా దినోత్సవం వేడుకలు
ఎమ్మెల్యే భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్రం మత సామరస్యానికి ప్రతీక అని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. బాలికల మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ లో మైనారిటీ సంక్షేమ దినోత్సవంతో పాటుగా జాతీయ విద్యా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భాస్కర్ రావు హాజరయ్యారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కోసం విశేష కృషి చేస్తోందన్నారు. మైనారిటీ పిల్లల కోసం అద్భుతమైన రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రభుత్వం నిర్మించి నాణ్యమైన విద్యను అందిస్తున్నదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద ముస్లిం యువతుల పెండ్లి కోసం షాదీ ముబారక్ పథకం ద్వారా రూ.1,00,116 ఆర్ధిక సాయం అందజేస్తోందన్నారు. మైనారిటీస్ ఓవర్ సీస్ పథకం ద్వారా ముస్లిం యువత విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉపకార వేతనాలను మంజూరు చేస్తోందన్నారు. మసీదుల్లో దశాబ్దాలకు పైగా సేవలందిస్తున్న ఇమామ్ లకు, మౌజమ్ లకు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ వేతనం అందజేస్తున్నదని అన్నారు. మైనారిటీల అభ్యున్నతితో పాటు అన్ని వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం వినూత్న సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పకడ్బందీగా అమలు చేస్తోందని భాస్కర్ రావు తెలిపారు. 2014 లో రాష్ట్ర తలసరి ఆదాయంతో పోలిస్తే, ఇప్పుడు పెరిగింది. మన తలసరి ఆదాయంలో సగం కూడా దేశానిది లేదు. కేంద్రం బలహీనంగా ఉంటే రాష్ట్రం కూడా బలహీనంగానే ఉంటుంది. ఏ పరిస్థితుల కారణంగానైనా కేంద్రంలో గడబిడ ఉంటే కచ్చితంగా దానిని ఆపాలి.దానిని గాడిలో పెట్టాల్సిన బాధ్యత మనదేనని భాస్కర్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల పక్షపాతి అని తెలిపారు. అనంతరం జాతీయ మైనారిటీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పలు పోటీల్లో గెలుపొందిన చిన్నారులకు భాస్కర్ రావు జ్ఞాపికలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కో-ఆప్షన్ సభ్యులు మోసిన్ అలి, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, కౌన్సిలర్లు ఇలియాస్, బంటు రమేశ్, టీఆర్ఎస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు బాసాని గిరి, మైనారిటీ నాయకులు ఫహీముద్దీన్, ప్రిన్సిపల్ అరుణ, తదితరులు పాల్గొన్నారు.👌👍💐@హమీద్ షేక్