
గంజాయి పట్టివేత…
* నిషేదిత 488 కేజీల గంజాయి స్వాధీనం
* విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.జి వెల్లడి
భద్రాద్రి కొత్తగూడెం, అక్షిత ప్రతినిధి :
భద్రాచలం పోలీసులు నిషేదిత గంజాయిని స్వాధీనం చేసుకున్నారని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు, దీని విలువ
రూ.97,60,000లు ఉంటుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.జి తెలిపారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా సిసిఎస్ పోలీసులు, భద్రాచలం పోలీసులు తమ సిబ్బందితో కలిసి భద్రాచలం ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా బస్టాండ్ వైపు నుండి భద్రాచలం బ్రిడ్జి వైపుగా వస్తున్న రెండు ఇన్నోవా వాహనాల నుండి పోలీసు వారిని చూసి ఇద్దరు డ్రైవర్లు వాహనాలను వదిలేసి పారిపోతుండగా గమనించి వారిని వెంబడించి పట్టుకుని విచారించడం జరిగిందని చెప్పారు. ఏపి-29, బీఆర్-1116, మరో వాహనం ఏపి-09, ఏజెడ్-9868 నంబర్లు కలిగిన రెండు వాహనాలను తనిఖీ చేయగా సుమారుగా రూ.97,60,000ల విలువ కలిగిన 488 కేజీల ప్రభుత్వ నిషేధిత గంజాయిని తరలిస్తున్నట్లుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. పట్టుబడిన ఇద్దరు వ్యక్తులను విచారించగా ఇద్దరు సారపాకకు చెందిన శివశంకర్ రెడ్డి నాగేంద్రబాబు అని తెలిపారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, ఒడిసా సరిహద్దు పరిసర ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తుల వద్ద నుండి నిషేధిత గంజాయిని కొనుగోలు చేసి మహారాష్ట్ర, జహీరాబాద్కు చెందిన అమీర్ అనే వ్యక్తికి అమ్మడానికి తరలిస్తున్నట్లు విచారణలో తేలిందని చెప్పారు. ముఖ్య నిందితుడైన శివశంకర్ రెడ్డి మూడు కేసులలో ఉన్నాడని, అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో అతనిపై పిడి యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. పట్టుబడిన వీరి నుండి 228 ప్యాకెట్లలోని 488 కేజీల గంజాయిని, 2 ఇన్నోవా కార్లను, 1 మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేసి, కోర్టుకు రిమాండ్ చేసినట్లు తెలిపారు.