మహిళలకు ముందస్తుగా పరీక్షలు
తన్నీరు హరీష్ రావు
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
మహిళలు వ్యాధుల బారిన పడకుండా ముందస్తుగా పరీక్షలు నిర్వహించి తగిన చికిత్స అందించేందుకు ప్రభుత్వం మార్చి 8 న మహిళా దినోత్సవం నాడు వంద ఆరోగ్య మహిళ కేంద్రాలను ప్రారంభిస్తుందని, ప్రతి మంగళవారం ఈ కేంద్రాలలో మహిళలకు పరీక్షలు నిర్వహించి తదుపరి చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. శనివారం రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరిష్ రావు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి లతో కలిసి ఆరోగ్య మహిళ, సిపిఆర్ శిక్షణ, కంటి వెలుగు, వడ్డీ లేని రుణాలు, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, ఇటీవల కాలంలో రాజేంద్రనగర్ లో ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ సిపిఆర్ నిర్వహించడం వల్ల రాజశేఖర్ అనే వ్యక్తి ప్రాణాలు కాపాడటం జరిగిందని, కరోనా తరువాత కారణాలు తెలియకుండా వయస్సుతో నిమిత్తం లేకుండా చాలా మంది ఆకస్మికంగా గుండె పోటు వచ్చి చనిపోతున్నారని, ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో 19 సంవత్సరాల యువకుడు పెళ్లి వేడుకలో మరణించారని, సిపిఆర్ చేయడం వల్ల ఆకస్మికంగా గుండె పోటు వచ్చే వారిలో 50 శాతం మంది ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు. వైద్య శాఖ అంచనా ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరానికి 24 వేల మంది ఆకస్మిక గుండె పోటుతో చనిపోతున్నారని, వీరిలో సగం మందిని కాపాడే అవకాశం సిపిఆర్ ద్వారా లభిస్తుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మందికి సిపిఆర్ శిక్షణ అందించాలని, హెల్త్ వర్కర్స్, స్వశక్తి మహిళా సంఘాలు, ఆర్టిసి సిబ్బంది, పోలిస్ సిబ్బంది, షాపింగ్ మాల్స్ , అపార్ట్మెంట్ నిర్వాహకులు, టీచర్స్ మొదలగు వివిధ వర్గాల ప్రజలకు శిక్షణ అందించడం జరుగుతుందని, ప్రతి జిల్లాలో మార్చి 13 నుంచి సిపిఆర్ శిక్షణ ప్రారంభించాలని , స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలను భాగస్వామ్యం చేయాలని తెలిపారు. జిల్లాలో సిపిఆర్ శిక్షణ అందించేందుకు ప్రతి జిల్లాకు 5 నుంచి 7 మాస్టర్ ట్రైయినర్లను అందుబాటులో ఉంచి ప్రతి రోజూ కనీసం 300 మందికి శిక్షణ అందించేలా కలెక్టర్ లు పర్యవేక్షణ చేయాలని, జిల్లాలో మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1200 ఆరోగ్య కేంద్రాలలో ఏఈడీ యంత్రాలను 18 కోట్లు ఖర్చు చేసి ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 63.82 లక్షల మంది ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి 11.42 లక్షల మందికి రీడింగ్ కళ్ళద్దాల పంపిణీ, 8.02 లక్షల మందికి ప్రిస్క్రిప్షన్ కళ్ళద్దాలను అందించుటకు ఆర్డర్ చేశామని అన్నారు. జిల్లాలో ప్రిస్క్రిప్షన్ కళ్ళద్దాలను సకాలంలో పంపిణీ చేయాలని, కలెక్టర్ లు ప్రతి రోజూ వీటిని పర్యవేక్షించాలని, ప్రతి రోజూ ప్రతి శిబిరానికి కనీసం 100 మంది వచ్చేలా ప్రణాళిక తయారు చేసుకోవాలని మంత్రి తెలిపారు. మార్చి 8న మహిళా దినోత్సవ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 100 ఆరోగ్య కేంద్రాలలో ముందస్తుగా ఆరోగ్య మహిళా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, భవిష్యత్తులో వీటిని మరింత విస్తరిస్తామని మంత్రి హరిష్ రావు తెలిపారు. ఆరోగ్య మహిళ క్రింద ప్రతి మంగళవారం 100 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, బస్తీ దవాఖానాలో మహిళల కోసం ప్రత్యేక క్లినిక్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ క్లినిక్ లో మహిళలకు 8 ప్యాకేజీలలో 57 రకాల పరీక్షలను చేయడం జరుగుతుందని, ప్రాథమిక డయాగ్నాస్టిక్, క్యాన్సర్ స్క్రీనింగ్, వెయిట్ మేనేజ్మెంట్, మైక్రో న్యూట్రిషన్ డెఫిషియన్సీ, సెక్సువల్ ట్రాన్స్ మిటెడ్ ఇన్ఫెక్షన్, పిసిఓడి, రుతుస్రావ సమస్యలు, ఇన్ ఫెర్టిలిటీ మేనేజ్మెంట్, మెనోపాజ్ మేనేజ్మెంట్, ఐవి, యూటిఐ & పెల్విక్ ఇన్ ఫ్లమేంటరి డిసిజెస్ వంటి అంశాలు పరీక్షించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో 26 జిల్లాలలో తెలంగాణ డయాగ్నిస్టిక్ అందుబాటులో ఉన్నాయని, ఏప్రిల్ చివరి నాటికి మరో 7 జిల్లాలో ఏర్పాటవుతాయని అప్పటి వరకు సమీప జిల్లాకు లింక్ చేశామని, శాంపిల్ ఇతర జిల్లా కేంద్రాలకు తరలించేందుకు అదనపు వాహనాలు సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. మహిళా క్లినిక్ లకు వచ్చే పేషెంట్ల వివరాలు ప్రత్యేక యాప్ లో నమోదు చేయడం జరుగుతుందని, వీటిని రిఫరల్ ఆసుపత్రికి లింక్ చేస్తామని, జిల్లా ఆసుపత్రిలో ఇబ్బందులు కలుగకుండా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని సూచించారు. మహిళా దినోత్సవం నాడు 2 సంవత్సరాల పెండింగ్ వడ్డి లేని రుణం బకాయిలు 650 కోట్ల నిధులు విడుదల చేయడం జరుగుతుందని, జిల్లా స్థాయి వేడుకలలో గ్రామీణ సంఘాలకు , మెప్మా సంఘాలకు చెక్ లు అందించాలని మంత్రి తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్. శాంతి కుమారి మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 58 ప్రకారం ఆమోదించిన దరఖాస్తుల ఇంటి పట్టాలను మార్చి 15 నాటికి పూర్తి చేయాలని సీఎస్ సూచించారు. ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 59, 76 ప్రకారం ఆమోదించిన దరఖాస్తుల నుంచి ప్రత్యేక మానిటరింగ్ చేసి రుసుము చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, క్రమబద్దికరణ రుసుము చెల్లించి తరువాత వెంటనే పట్టాల పంపిణీ జరగాలని, ఈ ప్రక్రియ త్వరితగతిన పూర్తి కావాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇంటి పట్టాల పంపిణీ కోసం సేకరించిన భూముల ప్రస్తుత వివరాలపై జిల్లాల వారీగా నివేదిక సమర్పించాలని కలెక్టర్ లకు సీఎస్ సూచించారు. పట్టణాలలో నిర్మాణం పూర్తి చేసిన డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం గత వారం రోజులలో లబ్దిదారుల ఎంపికలో మంచి పురోగతి ఉందని, మరో 10 వేలకు పైగా లబ్ధిదారుల ను ఎంపిక చేయాల్సి ఉందని, జిల్లా కలెక్టర్ లు ప్రత్యేక చొరవ తీసుకొని వారం రోజుల్లో లబ్దిదారులను ఎంపిక చేసి వివరాలు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాలని సీఎస్ అన్నారు. పోడు భూముల పంపిణీకి సంబంధించి జిల్లా స్థాయి కమిటీ వద్ద పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వారంలోగా పరిష్కరించా లని, జిల్లాలో ఆమోదించిన పోడు పట్టా వివరాలను డౌన్ లోడ్ చేసి ఒకసారి సరి చూసుకోని పట్టా పాస్ పుస్తకాలు ముద్రణ ప్రక్రియ వేగవంతం చేయాలని సీఎస్ సూచించారు.ఆయిల్ పామ్ సాగు క్రింద ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలను మార్చిలోగా పూర్తి చేయాలని, జిల్లాలో ఎంపిక చేసిన భూములలో వెంటనే ఆయిల్ పామ్ మొక్కలు నాటాలని, సంబంధిత భూములలో డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎస్ అన్నారు.తెలంగాణకు హరితహారం క్రింద వచ్చే సీజన్ లో నాటే మొక్కలు స్థానికంగా నర్సరీ నుంచి సిద్దం చేసుకోవాలి అని, రాబోయే 3 నెలలు మొక్కల సంరక్షణ కు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని సీఎస్ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి, ఎస్.పి.అపూర్వ రావు, అదనపు ఎస్.పి. కె అర్.కె.ప్రసాద రావు జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు, జడ్.పి.సి. ఈ. ఓ.ప్రేమ్ కరణ్ రెడ్డి,మున్సిపల్ కమిషనర్ కె.వి.రమణా చారి,గృహ నిర్మాణ పి.డి.రాజ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ కొండల్ రావు తదితరులు పాల్గొన్నారు.