
తెలంగాణ దేశానికే దిక్సూచి
* శోభకృత్’ నామ సంవత్సరం, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చాలి
* మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు
ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకు శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు ‘శోభకృత్’ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ కృషి, దైవకృపతో పుష్కలమైన నీరు, పచ్చని పంటపొలాలతో తెలంగాణ అలరారుతున్నదని ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు ఉగాది నుండే నూతన సంవత్సరం ఆరంభమౌతుందని, తమ వ్యవసాయ పనులను రైతన్నలు ఉగాది నుండే ప్రారంభించుకుంటారని భాస్కర్ రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సాగునీరు, వ్యవసాయ రంగాలకు అత్యధికంగా ప్రోత్సాహాన్ని అందిస్తున్నదని తెలిపారు. రైతన్నల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం, దేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ అనతి కాలంలోనే దేశం గర్వించేలా కనీవినీ ఎరుగని అభివృద్ధిని సాధించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా అనుబంధ వృత్తులు బలపడి తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైందన్నారు. వ్యవసాయం బాగుంటేనే సర్వ జనులు సంతోషంగా ఉంటారనే సూక్తిని తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్నదన్నారు. కరోనా వంటి కష్టకాలంలోనూ తెలంగాణ వ్యవసాయ రంగం దేశ జీడీపీకి దోహదపడడంలో ముందున్నదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఉత్పత్తి, సేవా రంగాల్లో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవ్వడంలో వ్యవసాయ రంగం పరోక్ష పాత్రను పోషిస్తున్నదని భాస్కర్ రావు అన్నారు. వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఈ ఉగాది.. రైతులకు, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చనున్నదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సాగునీరు, తాగునీరు, పచ్చని పంటలతో తెలంగాణ రాష్ట్రంలో నిత్య వసంతం నెలకొన్నదని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా దాని అనుబంధ రంగాలు, వృత్తులు బలపడి, తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైందని అన్నారు. తెలంగాణ సాధించిన ప్రగతి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ‘శోభకృత్’ నామ సంవత్సరం లో తెలంగాణతో పాటు భారతదేశం మరింత గొప్పగా అభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు. అభివృద్ధిలో దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారిందని ఎమ్మెల్యే భాస్కర్ రావు స్పష్టం చేశారు.