పెంచిన మందుల ధరలను వెంటనే తగ్గించాలి
*సిఐటియు డిమాండ్
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
కేంద్ర ప్రభుత్వం మెడిసిన్ పై పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డి.మల్లేష్ జిల్లా సహాయ కార్యదర్శి డాక్టర్ మల్లు గౌతంరెడ్డి లు ఆదివారం సంయుక్త ప్రకటనలో డిమాండ్ చేశారు. 800 రకాల మందులపై 12 శాతం ధరలు పెంచడంతోపాటు ఐదు శాతం జీఎస్టీ విధించడం సరికాదన్నారు. ప్రధానంగా ధీరకాలిక వ్యాధులైన షుగర్, బీపీ, క్యాన్సర్ ఇతర వ్యాధుల కోసం ఉపయోగించే మందుల ధరలను పెంచడం సామాన్య ప్రజలపై భారమన్నారు. ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో అల్లాడుతున్న సామాన్య ప్రజలపై మెడిసిన్ ధరలు పెరగడం మరింత భారంగా మారిందన్నారు. జీవించడం కోసం అనేక కష్టాలు పడుతున్న సామాన్యులు ఆరోగ్యాలు కాపాడుకోవడం కోసం మరింతగా కష్టపడాల్సి వచ్చిందని వాపోయారు. మోడీ ప్రభుత్వం చివరికి రోగులపై కూడా పనులు విధించడం సరైనది కాదన్నారు. ప్రజలపై పన్నుల భారం మోపడమే ప్రధాని మోడీ లక్ష్యంగా పెట్టుకున్నాడని అలాంటి కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్లకు రాయితీలు ఇస్తున్న మోడీ ప్రభుత్వం సామాన్యుల బతుకు కష్టంగా మార్చాలని ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన మెడిసిన్ ధరలను వెంటనే తగ్గించాలని, నిత్యావసర వస్తువుల ధరలు అదుపులో పెట్టాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.