*ఐజేయూ నేతలతో ఢిల్లీ జర్నలిస్టుల భేటీ

*ఐజేయూ నేతలతో డిల్లీ జర్నలిస్టుల భేటీ
*-అనుబంధంగా అసోసియేషన్ 

న్యూ ఢిల్లీ, అక్షిత ప్రతినిధి :

దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఆయా తెలుగు మీడియా సంస్థల సీనియర్ జర్నలిస్టులు సోమవారం సాయంత్రం ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ), తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే), ఆం.ప్ర.వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఏపీయూ డబ్ల్యుజె) నేతలు కే.శ్రీనివాస్ రెడ్డి, ఎస్.ఎన్.సిన్హా, కే. విరాహత్ అలీ, ఐ.వి.సుబ్బారావులతో ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా కాన్ఫరెన్స్ హాలులో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా దాదాపు రెండు గంటల పాటు జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.
కే.శ్రీనివాస్ రెడ్డి గారి సారథ్యంలో కొనసాగుతున్న ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ)కు అనుబంధంగా, ప్రాంతాలకు అతీతంగా ఢిల్లీ అసోసియేషన్ ఆఫ్ తెలుగు జర్నలిస్ట్స్ సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే గత కొంతకాలంగా ఢిల్లీలో కొనసాగుతున్న ఆంధ్ర జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఢిల్లీ(ఆజాద్) సంఘాన్ని కొత్తగా ఏర్పాటయ్యే ఢిల్లీ అసోసియేషన్ ఆఫ్ తెలుగు జర్నలిస్ట్స్ సంఘంలో విలీనం చేసేందుకు చర్యలు చేపట్టాలని ఐజేయూ అధ్యక్షులు కే.శ్రీనివాస్ రెడ్డి సూచించగా, త్వరలో తమ అసోసియేషన్ సమావేశాన్ని నిర్వహించి తగు నిర్ణయం తీసుకుంటామని ఆజాద్ సంస్థ వ్యవస్థాపకుడు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఢిల్లీ బ్యూరో చీఫ్ క్రిష్ణ హామీ ఇచ్చారు.

అలాగే ప్రాంతాలకు అతీతంగా ఢిల్లీలో తెలుగు జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఏర్పాటు కావడం శుభపరిణామామని క్రిష్ణ స్వాగతించారు. ఢిల్లీ జర్నలిస్టులకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సంక్షేమ అమలు కోసం తమ వంతు చేయుతనిస్తామని ఆయా రాష్ట్రాల యూనియన్ ప్రధాన బాధ్యులు కే. విరాహత్ అలీ, ఐ.వి.సుబ్బారావులు భరోసానిచ్చారు. వీలైనంత తొందరలో ఐజేయూ నేతృత్వంలో ఢిల్లీ అసోసియేషన్ ఆఫ్ తెలుగు జర్నలిస్ట్స్ సంఘానికి రిజిస్ట్రేషన్ పూర్తి చేసి కమిటీని ఎన్నుకుంటామని ఢిల్లీ జర్నలిస్టులు స్పష్టం చేశారు. ఇందుకుగాను కార్యక్రమాల నిర్వహణకు అడ్ హాక్ కమిటీని ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో ఢిల్లీ సీనియర్ పాత్రికేయులు క్రిష్ణ(ఏబీఎన్ ఆంధ్రజ్యోతి), విజయ్ భాస్కర్ (ఈనాడు బ్యూరో చీఫ్) టి.శ్రీనివాస్ (టీవీ 5 బ్యూరో చీఫ్) లతో పాటు 20మంది ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సీనియర్ పాత్రికేయులు, వీడియో జర్నలిస్టులు పాల్గొన్నారు.

*ఢిల్లీ అడ్ హాక్ కమిటీ*
—————————–
ఢిల్లీ అసోసియేషన్ ఆఫ్ తెలుగు జర్నలిస్ట్స్ తదుపరి కార్యక్రమాల నిర్వహణకు గాను అడ్ హాక్ కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ కన్వీనర్ గా పి.గోపి క్రిష్ణ, కో-కన్వీనర్ గా పి.స్వరూప, కమిటీ సభ్యులుగా టి.శ్రీనివాస్, ఎం.శివ, సంజయ్, భారత్ లను ఢిల్లీ తెలుగు జర్నలిస్టులు ఎన్నుకున్నారు.

*మహాత్మాను* *పరామర్శించిన* *యూనియన్ నేతలు*
——————————


స్వల్ప అస్వస్థతతో చికిత్స పొంది ఆసుపత్రి నుండి మూడు రోజుల క్రితమే డిశ్చార్జి అయ్యిన ఢిల్లీ Tv9 బ్యూరో చీఫ్ మహాత్మా ఇంటికెళ్లి ఐజేయూ, టీయూ డబ్ల్యుజే, ఏపీయూడబ్ల్యుజె నేతలు కే.శ్రీనివాస్ రెడ్డి, ఎస్.ఎన్.సిన్హా, కే.విరాహత్ అలీ, ఐ.వి.సుబ్బారావులు పరామర్శించారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు ఆయనను సూచించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking