చేర్యాల్ లో పల్లా రాజేశ్వర్ రెడ్డికి నిరసన సెగ
-ఎమ్మెల్సీ పల్లాను అడ్డుకున్న జేఏసీ,అఖిలపక్ష నాయకులు
చేర్యాల,అక్టోబర్ 11 అక్షిత ప్రతినిధి:
పట్టభద్రుల ఎమ్మెల్సీ, జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. జనగామ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని ప్రకటించడంతో పల్లా రాజేశ్వర్ రెడ్డి బుధవారం కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొమురవెల్లి నుండి జనగామ వరకు భారీ బైక్ ర్యాలీగా వెళ్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డికి వ్యతిరేకంగా,చేర్యాల పట్టణంలో రెవెన్యూ డివిజన్ జేఏసీ నాయకులు మరియు అఖిలపక్ష నాయకులు పల్లా గోబ్యాక్ అంటూ నినాదాలతో అడ్డుకునే ప్రయత్నం చేశారు.

నిరసనను గమనించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి దీక్ష శిబిరం వద్దకు చేరుకొని జేఏసీ నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ, జేఏసీ,అఖిలపక్ష నాయకులు గో బ్యాక్ గో బ్యాక్ పల్లా అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో పల్లా రాజేశ్వర్ రెడ్డి వెనుతిరిగారు. అటు జేఏసీ నాయకులు, ఇటు పల్లా వర్గీయుల నినాదాలతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు ఇరు వర్గాల నాయకులను చిదరగొట్టే ప్రయత్నం చేశారు.