క్రీస్తు మాకు ఆదర్శం

క్రీస్తు మాకు ఆదర్శం

పేదల అభివృద్ధికై…మాటిస్తున్న

చెప్పినట్టుగానే డిసెంబర్‌లో తెలంగాణ‌లో కూడా మిరాకిల్

*క్రిస్మస్ వేడుకల్లో సీఎం
రేవంత్ రెడ్డి

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

డిసెంబర్‌ నెలలో తెలంగాణ‌ రాష్ట్రంలో మిరాకిల్ జరుగుతుందని.. ఆ విషయం తాను ముందే చెప్పానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. శుక్రవారం ఎల్ బీ స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచానికి డిసెంబర్ మిరాకిల్ నెల అని అన్నారు. చెప్పినట్టుగానే డిసెంబర్‌లో తెలంగాణ‌లో కూడా మిరాకిల్ జరిగిందని.. క్రైస్తవులు, మైనార్టీలు కొత్త ప్రభుత్వం రావాలని కోరుకున్నారు. కోరుకున్నట్లుగానే నూతన ప్రభుత్వాన్ని తీసుకొచ్చారన్నారు.

మొన్న కర్ణాటక.. నిన్న హిమాచల్ ప్రదేశ్… నేడు తెలంగాణలో సెక్యులర్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ఇంతకంటే మరో గురుతర బాధ్యత మీపై ఉంది.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ రావాలని కోరుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దేశంలో మణిపూర్ సంఘటన ప్రస్తుత బీజేపీ వైఖరిని తెలియజేస్తుందని మండిపడ్డారు. మణిపూర్ లో జరుగుతున్న సంఘటనలను పట్టించుకోకుండా బీజేపీ ప్రభుత్వం ఎన్నికల్లో మునిగిపోయిందని విమర్శించారు. మణిపూర్ బాధితులను పరామర్శించడానికి రాహుల్ గాంధీ ప్రయత్నిస్తే అడ్డుకున్నరన్నారు. మణిపూర్ లాంటి ఘటనలు దేశంలో ఎక్కడా జరగకుండా చూడాల్సిన బాధ్యత దేశ ప్రజలపై ఉందన్నారు.


“నిస్సహాయులకు సహాయం అందించండం మా ప్రభుత్వ ధ్యేయం. అర్హత కలిగిన వారికి అవకాశాలు కల్పించడం మా ప్రభుత్వ లక్ష్యం. ఈ వేదికగా నేను మీకు మాట ఇస్తున్నా..తెలంగాణలో ఏర్పడ్డ ఇందిరమ్మ రాజ్యం… పేదల అభివృద్ధికి పాటు పడుతుంది. సంక్షేమ పథకాలను ప్రతీ పేదకు చేరేలా చూస్తాం. మేం పాలకులం కాదు.. సేవకులం. ఏసు క్రీస్తు మాకు ఆదర్శం. బాధ్యతను మరవకుండా పనిచేస్తూ ముందుకెళతాం. ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకురండి సచివాలయం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి…తప్పకుండా సమస్యలను పరిష్కరిస్తామని” సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులు, సంస్థలను ముఖ్యమంత్రి అవార్డులతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, డీజీపీ రవి గుప్తా, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్, సంపత్ కుమార్, క్రైస్తవ మత పెద్దలు, ఫాస్టర్లు, అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking