ప్రజలంతా పాడిపంటలతో వర్ధిల్లాలి

ప్రజలంతా పాడిపంటలతో వర్ధిల్లాలి

కన్నులపండువగా కల్యాణోత్సవం

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్గొండ, అక్షిత ప్రతినిధి :

ప్రజలు పాడి పంటలతో , సుఖ సంతోషాలతో , ఆరోగ్యంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకాంక్షించారు. శనివారం ఆయన నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం, చెరువుగట్టు శ్రీ జడల రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చెరువు గట్టు గ్రామంలోని శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం తెల్లవారు జామున కల్యాణోత్సవం కన్నుల పండుగగా వైభవంగా జరిగింది. ప్రధాన ఆలయం నుంచి స్వామి వారిని, అమ్మవారిని నంది వాహనంపై మంగళవాయిద్యాలు, భజనల మధ్య కల్యాణ మండపం వద్దకు తీసుకొచ్చారు.వేద పండితులు వేదమంత్రోచ్ఛరణల నడుమ కల్యాణ తంతు జరిపించారు. స్వామి వారికి మంత్రి శేష వస్త్రాలు సమర్పించారు. .

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాబోయే మూడు నెలల్లో బ్రాహ్మణ వెళ్ళేంల ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేస్తామని అన్నారు. మొదటి విడతలో 60 వేల ఎకరాలకు నీటి విడుదల చేస్తామని,అదే రోజు సీఎం రేవంత్ రెడ్డిచే సమీక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. చెరువుగట్టుకు రెండో ఘాట్ రోడ్డు, భక్తులు నిద్రించేందుకు మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాబోయే కాలంలో బ్రాహ్మణ వెల్లంల, ఎస్ఎల్ బీసీ, డిండి ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజల సమస్యలు పరిష్కరించి పేదల గుండెల్లో ఉంటామని అన్నారు.

తెల్లవారుజామున జరిగిన స్వామి వారి కల్యాణ మహోత్సవానికి అలాగే రాబోయే 4 రోజులలో వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మొక్కులు సమర్పించేందుకు భక్తులకు అనుమతించాలని తెలిపారు. స్వామి వారి ఉత్సవాలు తిలకించేందుకు భక్తులకు ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వాహనాలను పార్కింగ్ ప్రదేశాల్లో నిలిపేసి గట్టుపైకి రావాలని, పోలీసులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారని అందుకు అనుగుణంగా మౌళిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఆలయ అభివృద్ధికి ఎల్లవేళలా తన సహకారం అందిస్తానని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

ఈ కల్యాణోత్సవానికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరయ్యారు.
మునిసిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి,ఆర్ డి ఓ రవి, డి ఎస్ పి శివరాం రెడ్డి. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్. నవీన్, వేద పండితులు బ్రహ్మశ్రీ అల్లవరపు సుబ్రమణ్య దీక్షాతావదాని, శివశ్రీ డాక్టర్ పి. నీలకంఠ శివాచార్య, ప్రధాన అర్చకులు డాక్టర్ పి. రామలింగేశ్వర శర్మ, స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.జిల్లాతో పాటు, ఇతర జిల్లాల నుండి దాదాపు లక్ష మంది భక్తులు తరలివచ్చి స్వామి వారి కల్యాణాన్ని తిలకించారు.
___________

Leave A Reply

Your email address will not be published.

Breaking