గోపాల్ కు కీర్తి పురస్కారం
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
కవి, రచయిత, వ్యాఖ్యాత, సాహిత్య సాంస్కృతిక సంస్థల నిర్వాహకుడు మాడిశెట్టి గోపాల్ కు సాంస్కృతిక సంస్థల నిర్వహణ అంశంలో తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారాన్ని అందుకున్నారు. విశ్వ విద్యాలయం ఆడిటోరియం లో జరిగిన పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర జుడిషియల్ అకాడమీ డైరెక్టర్ మంగారి రాజేందర్ మరియు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్ లర్ ఆచార్య తంగడ కిషన్ రావు లు మాడిశెట్టి కి పురస్కారాన్ని ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ అసిస్టెంట్ డైరెక్టర్ రింగు రామమూర్తి, రిజిస్త్రార్ ఆచార్య బట్టు రమేష్, సాహితీ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. గోపాల్ డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే జవహర్ సాహితీ కళా సమితిని ఇతరులతో కలిసి స్థాపించి దానిద్వారా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చైతన్య కళాభారతి నాటక సంస్థలో భాధ్యునిగా తెలంగాణ స్థాయి నాటక పోటీలు నిర్వహించారు. పలు నాటకాలలో నటునిగా కూడా నటించి మెప్పు పొందారు. సమైక్య సాహితి సాహితీ గౌతమి సంస్థల అధ్యక్షునిగా అసంఖ్యాకమైన కార్యక్రమాలు నిర్వహించారు. సమైక్య సాహితీ సంస్థ పక్షాన సాహిత్య కార్యక్రమాలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. నాటక రచయితకు తుమ్మల రంగస్థలం పురస్కారాన్ని అందజేస్తూ ఆ సందర్భంగా అనేక ఉత్తమ నాటకాలు ప్రదర్శింప జేశారు. రాగమంజరి సాంస్కృతిక సంస్థకు సహాధ్యక్షునిగా తెలంగాణ సాంస్కృతిక కళారూపాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షునిగా ఉత్తమ సినిమా అభిరుచిని ప్రేక్షకుల్లో పెంపొందించడానికి వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. ఉమ్మడి గతంలో నంది టీవీ పురస్కారాల కమిటీ జూరీ మెంబర్ గా పని చేశారు. కరీంనగర్ ఎన్నారై ఫోరం కరీంనగర్ వికాస వేదిక కోఆర్డినేటర్ గా, అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరపున పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ రచయితల వేదిక జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ కళారూపాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. చెలిమి చెలిమెలు కవితా సంపుటి వెలువరించారు. వివిధ పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. వేలాది సాంస్కృతిక మరియు ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి ఉత్తమ వ్యాఖ్యాత పురస్కారాన్ని గెలుచుకున్నారు. పలు షార్ట్ ఫిలింలలో నటించారు. సాంస్కృతిక బృందంతో సింగపూర్ మలేషియా ఉగాది ఉత్సవాలలో పాల్గొన్నారు. ఇటీవల అమెరికా డల్లాస్ లో జరిగిన నాటా ఉత్సవాలలో అతిథిగా పాల్గొన్నారు. చేసిన సేవలకు గుర్తింపుగా కళాకారుల సంక్షేమ సమాఖ్య వారి ఉగాది పురస్కారం, దేవులపల్లి రామానుజ రావు స్మారక పురస్కారం, తడకమడ్ల పురస్కారం, అన్నమయ్య విశిష్ట సాహిత్య పురస్కారం, సరస్వత జ్యోతి పురస్కారం, కాలిఫోర్నియాలో సిలికానాంధ్ర వారి సన్మానం, కరీంనగర్ ఫోకార్డ్స్ అకాడమీ వారి వేదిక వాచస్పతి పురస్కారం, తెలంగాణ కళావేదిక వారి సినారె వాగ్భూషణ పురస్కారం, సినీ వాలి పురస్కారం, గురజాడ అంతర్జాతీయ పురస్కారం, అలిశెట్టి స్మారక పురస్కారం, లంబోదర కల్చరల్ అకాడమీ వారి కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం, సాయి అలేఖ్య సాంస్కృతిక సంస్థ వారి పురస్కారం, వ్యాఖ్యాన సామ్రాట్ బిరుదు, సాహితీరంగ సామ్రాట్టు బిరుదు, కూచిపూడి మేదిని నృత్య సంస్థ వారి కళాబంధు బిరుదు, మై గిఫ్ట్ సంస్థ వారి పురస్కారం, తేజ రాష్ట్రస్థాయి పురస్కారం, తదితర ప్రశంసలు పొందారు.