అన్నపూర్ణ క్యాంటీన్ ఆకస్మిక తనిఖీ

అన్నపూర్ణ క్యాంటీన్
ఆకస్మిక తనిఖీ

భోజనమెలా ఉంది?

నల్గొండ, అక్షిత ప్రతినిధి :

జిల్లా కేంద్రంలోని రైతు బజార్ పక్కన ఉన్న అన్నపూర్ణ క్యాంటీన్ ను బుధవారం జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ పెడుతున్న 5 /- రూపాయల భోజనాన్ని పరిశీలించారు. భోజనం చేస్తున్న వారితో భోజనం ఎలా ఉందని ఆయన అడిగారు. ఎక్కడినుండి వచ్చారని, భోజనం ఎలా ఉందని కనుక్కున్నారు.

అన్నపూర్ణ క్యాంటీన్ పరిసరాలలో పూర్తి పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని,ఎప్పటికప్పుడు చెత్తా,చెదారాన్ని తొలగించాలని, తాగు నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని, అలాగే ఒక ట్యాప్ కనెక్షన్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.మున్సిపల్ అధికారులు క్యాంటీన్ చుట్టూ పక్కల ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేయించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా భోజనం చేసేందుకు వచ్చిన కూలీలు, ఆటో రిక్షా నడిపేవారు, నల్గొండకు వివిధ ప్రాంతాల నుండి వివిధ పనులపై వచ్చిన వారితో జిల్లా కలెక్టర్ భోజనం ఎలా ఉందని ప్రశ్నించగా, భోజనం బాగుందని, కేవలం 5 /-రూపాయలకే భోజనం పెట్టడం సంతోషంగా ఉందని, అన్నం, పప్పు, ఒక కూర ,చట్నీ ఇస్తున్నారని వారు తెలిపారు.

“మాది గుర్రంపోడు మండలం జిన్న చింత గ్రామం. నా పేరు వెంకాయమ్మ మేము వ్యవసాయం చేస్తాము. మందుల కోసం నల్గొండకు వచ్చాను. ఐదు రూపాయలకే అన్నపూర్ణ క్యాంటీన్లో అన్నం పెట్టడం బాగుంది. అన్నంతో పాటు, ఈరోజు పప్పు, బీరకాయ, సాంబారు, చట్నీ ఇచ్చారు.అన్నం వేడిగా బాగా ఉంది.ఊర్లల్లో మా ఇంట్లో కూడా ఇలా ఉండదు. అన్నంతో పాటు, ఒక వాటర్ ప్యాకెట్ కూడా ఇస్తున్నారు. ప్రభుత్వం అన్నపూర్ణ క్యాంటీన్ ద్వారా 5/-రూపాయలకే భోజనం పెట్టడం మాలాంటి వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంది”.

” అన్నపూర్ణ క్యాంటీన్లో 5 /- రూపాయలకు పెడుతున్న భోజనం బాగుంది. ఈరోజు రేపు 5/-రూపాయలకు టీ కూడా రావటం లేదు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇక్కడ అన్నం పెడుతున్నారు. ఈ క్యాంటీన్ ద్వారా ఎంతోమంది కూలీలు, చివరికి అడుక్కునేవారు కూడా 5 రూపాయలు ఇచ్చి భోజనం చేస్తున్నారు. 100 రూపాయలు ఛార్జి పెట్టుకొని దేవరకొండ, మిర్యాలగూడ తదితర ప్రాంతాల నుండి పని కోసం ఇక్కడకు ఎంతో మంది కూలీలు వస్తున్నారు. ఒక్కు రోజు పని దొరకదు. అప్పుడు 5 /-రూపాయల భోజనం మాకు దిక్కు అవుతున్నది”- సైదులు అమ్మారెడ్డి గూడెం, కూలి.

ప్రభుత్వం అన్నపూర్ణ క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకు అందిస్తున్న భోజనం ఎంతోమంది ఆకలి తీరుస్తున్నది. ముఖ్యంగా పల్లెటూరు నుండి నల్గొండ జిల్లా కేంద్రానికి వచ్చి భోజనం చేయాలనుకునే కూలీలకు, ఆటో రిక్షావారికి, ఇతరులకు ఇది ఒక అక్షయపాత్రగా నిలుస్తున్నది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Leave A Reply

Your email address will not be published.

Breaking