ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను సందర్సించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
వరంగల్, అక్షిత బ్యూరో:
వరంగల్, ఖమ్మం,నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ నిమిత్తం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను
జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద బుధవారం సందర్శించారు.
వరంగల్ కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో ఎన్నికల సామాగ్రి పంపిణీ తీరుతెన్నులను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.తాగునీటి వసతి, భోజన వసతి, షామియానాలు ఇతర అన్ని వసతులు ఏర్పాటు చేయగా, పీ.ఓ, ఓ.పీ.ఓలతో కూడిన బృందాలన్నీ హాజరయ్యాయా లేదా అని కలెక్టర్ ఆరా తీశారు. బ్యాలెట్ పద్ధతి ద్వారా పోలింగ్ ప్రక్రియను జరిపించాల్సిన తీరు గురించి, వెంట తీసుకెళ్లాల్సిన బ్యాలెట్ పత్రాలు, పోలింగ్ సామాగ్రి గురించి ప్రయోగాత్మకంగా వివరిస్తున్న తీరును గమనించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ ఎన్నికల విధులు నిర్వహించడానికి
పంపిణీ కేంద్రానికి వచ్చిన పిఓ, ఓపిఓ, మైక్రో అబ్జర్వర్లు, అధికారులు పోలింగ్ లో ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావులేకుండా సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని పక్కాగా అందించాలని, చెక్ లిస్టు ప్రకారం ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రి అందినదా, లేదా జాగ్రత్తగా పరిశీలించుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. పోలింగ్ సిబ్బందితో పాటు పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించే పోలీసు సిబ్బందిని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన బస్సులను పరిశీలించి, సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ సామాగ్రి పీ.ఎస్ లకు తీసుకెళ్తున్న సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే తమ దృష్టికి తేవాలని సూచించారు. కాగా, జిల్లాలో 13 పోలింగ్ కేంద్రాలలో గురువారం ఉదయం 8.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు.
ప్రలోభాలకు లొంగోద్దు
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని అన్నారు. జిల్లాలో
ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్లు 2352 మంది ఉన్నారని వివరించారు. 13 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు.
ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఉంటుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో పీ.ఓ, ఓపీఓలను నియమించామని కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కలిగి ఉన్న వారు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్. సంధ్యారాణి, డిఆర్ ఓ విజయలక్ష్మి, సంబంధిత అధికారులు, సెక్టోరల్ అధికారులు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.