ప్రత్యామ్నాయ పంటలు వేయాలి
కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
రైతులు ఎల్లప్పుడూ వరినే కాకుండా ప్రత్యామ్నాయ పంటలు కూడా వేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.వరిలో సన్నధాన్యాన్ని ఎక్కువగా పండించాలని చెప్పారు.ఈ ఉగాది నుండి రాష్ట్ర ప్రభుత్వం చౌకధర దుకాణాల ద్వారా రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేయనున్నదని, హుజూర్నగర్ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని వెల్లడించారు. వచ్చే సంవత్సరం సన్నధాన్యాన్ని అధిక మొత్తంలో పండించాలని ఆయన రైతులకు సూచించారు.
సోమవారం నల్గొండ జిల్లా, తిప్పర్తి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రబీ దాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గత సంవత్సరం తిప్పర్తి పిఎసిఎస్ ద్వారా సుమారు 75000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని అన్నారు. రాష్ట్రప్రభుత్వం సన్న ధాన్యం పండించిన రైతులకు 2320 రూపాయల మద్దతు ధరతో పాటు, 500 రూపాయల బోనస్ ఇస్తున్నదని చెప్పారు . కాలువలు మరమ్మతు చేయించడం, నాగార్జునసాగర్ తో పాటు, ఉదయ సముద్రం ద్వారా 2 పంటలకు నీరు విడుదల చేయడం వల్ల సాగునీటి విస్తీర్ణం పెరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల లోపు రుణమాఫీ చేసిందని, ప్రత్యేకించి తిప్పర్తి జంక్షన్ ను అభివృద్ధి చేయడంతో పాటు, రోడ్లు చేపట్టడం జరిగిందన్నారు.

జిల్లాలోని ప్రజల సమస్యలను తీర్చేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా, జిల్లా కలెక్టర్ ప్రత్యేకించి వయో వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక ప్రజావాణి నిర్వహిస్తున్నారని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని తూర్పారబట్టే యంత్రాలు,తేమ కొలిచే యంత్రాలు,అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని, రైతులు నాణ్యతా ప్రమాణాలతో ధాన్యాన్ని తీసుకురావాలని కోరారు. ఎస్ఎల్బీసీ సొరంగం పనులను ప్రారంభించి పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ధాన్యాన్ని ఆరబెట్టి, శుభ్రం చేసుకుని కొనుగోలు కేంద్రాలకు తేవాలని రైతులకు సూచించారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్లు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు ఉన్నట్లయితే జిల్లా పౌరసరఫరాల అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల విభాగానికి తెలియజేయాలన్నారు. ధాన్యం కొనుగోలులో అక్రమాలను అరికట్టేందుకు ఇంటిగ్రేటెడ్ ఫ్లయింగ్ స్క్వాడ్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతులు సన్నధాన్యం పండించడంపై దృష్టి పెట్టాలని కోరారు.అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్, తదితరులు మాట్లాడారు.
డిసిసిబి డైరెక్టర్ సంపత్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ హరీష్, మార్కెటింగ్ ఏడి ఛాయాదేవి, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.