లక్ష్యం దిశగా చదవాలి
పాఠం బోధించిన కలెక్టర్
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
భవిష్యత్తులో సమాజంలో ఉన్నత స్థానాన్ని పొందేందుకు విద్యార్థినిలు ఇంటర్మీడియట్ స్థాయిలోనే
మంచి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోని ఆ లక్ష్యసాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి చెప్పారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను సందర్శించారు.ఈ సంవత్సరం కళాశాలలో నూతన ప్రవేశాలు, ఇదివరకు ఉన్న విద్యార్థుల సంఖ్య, తదితర వివరాలను, ఇటీవల కళాశాలలో చేపట్టిన మరమ్మతు పనులు, ఇతర అభివృద్ధి పనులను ప్రిన్సిపల్ సుధారాణి ద్వారా అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఇంటర్మీడియట్
మొదటి సంవత్సరం ఇంగ్లీష్ మీడియం ఎంపీసీ, బైపీసీ తరగతి గదులలోకి వెళ్లి విద్యార్థినిలతో ముఖాముఖి మాట్లాడారు.

ఏ పాఠశాల నుండి వచ్చారని? పదవ తరగతిలో ఎన్ని మార్కులు వచ్చాయని ? జీవితంలో మీ ఆశయాలు ఏంటని ?అందుకు ఎలా కష్టపడుతున్నారని? అడుగుతూనే ఇంజనీరింగ్ లో మంచి కోర్సులు సంపాదించేందుకు, అలాగే భవిష్యత్తులో మంచి మంచి కంపెనీలలో ఉద్యోగాలు సాధించేందుకు అవసరమైన మెళకువలను గురించి తెలిపారు.

ఒక మంచి ఇంజనీర్ కావాలంటే చేయాల్సిన పనులను,అలాగే మంచి డాక్టర్ అయ్యేందుకు చదువులో ఎలాంటి పద్ధతులు అవలంబించాలో సూచించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులకు పలు విలువైన సూచనలు చేస్తూ ఇంటర్ స్థాయిలోనే ఉన్నత లక్ష్యం ఏర్పాటు చేసుకున్నట్లయితే భవిష్యత్తులో సమాజంలో ఒక ఉన్నత స్థానంలో నిలుస్తారని,అందుకు కృషి చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ బైపీసీ ఇంగ్లీష్ మీడియం విద్యార్థినిలకు డిక్షనరీలను పంపిణీ చేశారు. కళాశాలలో ఖాళీ స్థలంలో విద్యార్థినిలు ఉదయం, సాయంత్రం వేలల్లో చదువుకునేందుకు, వేచి ఉండేందుకు గాను షెడ్ నిర్మాణానికై స్థలాన్ని పరిశీలించారు. కళాశాల ప్రిన్సిపల్ సుధారాణితో పాటు ,
అధ్యాపక బృందం తదితరులు ఉన్నారు.