బ్రేకింగ్ న్యూస్..
గాజులరామారాన్ని కుదిపిన కూల్చివేతలు…
అక్రమ నిర్మాణాలపై హైడ్రా సుడిగాలి చర్యలు
మేడ్చల్, అక్షిత బ్యూరో : ఆదివారం ఉదయం గాజులరామారం ఒక యుద్ధరంగాన్ని తలపించింది. సర్వే నంబర్లు 307, 342, 329/1, 348 వద్ద నెలలుగా కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై చివరకు హైడ్రా అధికారులు సుడిగాలి చర్యలు చేపట్టారు.
పదుల సంఖ్యలో జేసీబీలు, వందలాదిమంది సిబ్బంది, భారీ పోలీస్ బందోబస్తుతో వచ్చిన అధికారులు కూల్చివేతలు ప్రారంభించడంతో ప్రాంతమంతా అలజడి చెలరేగింది.

అధికారుల చర్యలకు బలం చేకూర్చేందుకు కుత్బుల్లాపూర్ జిహెచ్ఎంసి కమిషనర్ నరసింహ, గాజులరామారం జిహెచ్ఎంసి కమిషనర్ మల్లారెడ్డి, బాలనగర్ ఏసీపీ నరేశ్రెడ్డి, ఆర్డీవో, రెవెన్యూ శాఖ అధికారులు, విద్యుత్ శాఖ, హైద్రా బృందం, NDRF సిబ్బంది హాజరయ్యారు.
200 మందికి పైగా పోలీసులు మోహరించగా, చుట్టుపక్కల ప్రాంతమంతా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో కట్టడి చేయగా అక్రమ నిర్మాణాలను కూల్చివేత మొదలవగానే స్థానికులు పెద్ద ఎత్తున రోడ్లపైకి దూసుకొచ్చారు.
“దశాబ్దాలుగా ఇక్కడే నివసిస్తున్నాం… మా ఇళ్లను కూల్చవద్దు” అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే అధికారులు మాత్రం కఠినంగా వ్యవహరించారు. “సర్వే నంబర్లలో జరుగుతున్న నిర్మాణాలు పూర్తిగా అక్రమమైనవే. ఎలాంటి ఒత్తిడికీ లోబడము అని స్పష్టం చేసిన అధికారులు.

ఈ ఉద్రిక్తతలు మరింత పెరగకుండా పోలీసులు అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులో ఉంచారు. కూల్చివేతలు వేగంగా కొనసాగుతున్నాయి.