విశ్వసనీయతతోనే
జర్నలిజం మనుగడ
అక్షిత అక్షరం
ప్రజా పక్షం
ఉన్నది ఉన్నట్లు…
ఉండదు కనికట్టు
అక్షిత క్యాలెండర్ ఆవిష్కరణ
మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
విశ్వసనీయతతో కూడిన వార్తలతోనే జర్నలిజం మనుగడ సాధ్యమని ఐజేయూ జాతీయ అధ్యక్షులు, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం నాంపల్లిలోని మీడియా అకాడమీ భవనంలో తెలంగాణ చిన్న మధ్య తరహా పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబా, ప్రధాన కార్యదర్శి యాతాకుల అశోక్, అక్షిత చీఫ్ ఎడిటర్ దాస్ మాతంగి, అక్షిత బ్యూరో చీఫ్ కానుకుర్తి వినయ్ కుమార్ లతో కలిసి
అక్షిత జాతీయ తెలుగు దిన పత్రిక నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్రికలు తమ విశ్వసనీయతను కోల్పోకుండా ప్రజలకు బాసటగా నిలవాలన్నారు. నిజాలను నిర్భయంగా.. స్వేచ్ఛగా రాస్తూ ప్రజల సమస్యలకు వాస్తవ దర్పణం పట్టాలన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పత్రికలు పనిచేస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుందన్నారు.

ఉన్నది ఉన్నట్లు… ఉండదు కనికట్టుగా ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ప్రజల సమస్యలను పరిష్కరించే వేదికగా అక్షిత అక్షర యజ్ఞం సాగించాలని ఆకాంక్షించారు.
వాస్తవాలకు దర్పణం పట్టేలా అక్షిత అక్షర సమరం ఉండాలన్నారు. తెలంగాణ చిన్న మధ్య తరహా పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబా, ప్రధాన కార్యదర్శి యాతాకుల అశోక్, అక్షిత చీఫ్ ఎడిటర్ దాస్ మాతంగిలు మాట్లాడుతూ ప్రధాన స్రవంతి కల్గిన పత్రికలకు ధీటుగా చిన్న మధ్య తరహా పత్రికలు నిలవాలన్నారు. పత్రికలు ఎదుర్కొంటున్న సమస్యల సాధనకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నామని తెలిపారు. చిన్న, మధ్య తరహా పత్రికలకు ప్రభుత్వం మరింత ఆసరాగా నిలవాలని కోరారు. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి నిత్య నూతనత్వంతో క్యాలెండర్ ను మార్కెట్లోకి తీసుకురావడం అభినందనీయమని దాస్ ను అభినందించారు.