విద్య ద్వారానే బీసీలను శక్తివంతులను చేయవచ్చు
తెలంగాణ బీసీ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్
హైదరాబాద్, ఫిబ్రవరి 27 :
విద్య ద్వారానే బీసీలను శక్తివంతం చేయాలని ఉక్కు సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని తెలంగాణ బీసీ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ అన్నారు. శుక్రవారం నాడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన పథకాలు బిసి వర్గాల పిల్లలకు జీవితంలో ఎవరితోనైనా పోటీపడే అవకాశాలు కల్పిస్తున్నాయని, కులం ఎవరి కలలకు అడ్డు రాకూడదని ఈ ప్రభుత్వ అభిమతం అని అన్నారు. వెయ్యి సంవత్సరాల చీకటిని ఒక దీపం పార దోలి వేయగలదు, అని సత్యాన్ని నమ్మి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ మట్టిలో శతాబ్దాలు అణగారిన వర్గాలు పై మాటనే నమ్మి బతుకుతున్నాయని అన్నారు. ఆ దీపం పేరే “విద్య” అని అన్నారు. కానీ ఆ వెలుగును అందుకోవడం ఎంత కఠినమో మన సామాజిక చరిత్ర చెబుతుందని కులం పేరుతో అణచికవేత, వివక్ష, పేదరికం, ఇవన్నీ తరతరాలుగా బలహీన వర్గాల జీవితాలలో చెప్పలేనంతగా గాయాలు మిగిల్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నిటికీ విరుగుడు మార్గమే “ఎడ్యుకేషన్ ఈస్ ది ఓన్లీ లిబరేషన్” అని ప్రజా పాలన ప్రభుత్వం నమ్మింది అన్నారు. ఒక సమాజంలో కొందరు ఆకాశాన్ని అందుకునే అవకాశాలతో జీవిస్తూ ఉంటే మరికొందరు కులం అనే కటకటాల్లో చిక్కుకొని వెనుకబాటు గోడలు మధ్య జీవితాన్ని గడిపేస్తున్నారని శతాబ్దాలుగా బీసీలకు జరిగిన అన్యాయంపై పోరాటం చేసేందుకు అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను బిసి బిడ్డల కోసం ఈ ప్రభుత్వం కొనసాగిస్తుందని అన్నారు. కుల అణిచివేతను చెరిపి వేసే దిశగా విద్యా వెలుగులతో బీసీ సంక్షేమానికి కొత్త దశ దిశ చూపిస్తుందని అన్నారు. ఇవి కేవలం మాటలు కాదు ఒక సామాజిక విప్లవానికి నాంది ఈ సందేశం చదివిన ప్రతి ఒక్కరూ వారిలోనే అసమానత్వాలపై ఆలోచించకుండా ఉండలేరు ఎందుకంటే ఇది మన సమాజంలో దాగిన గాయాలను తెరిచి విద్య అనే మందు పూస్తుంది. తరతరాలుగా కులం పేరుతో బడుగు బలహీన వర్గాలు అణిచివేతకు గురి అవుతున్నాయని వెనకబాటు వివక్ష వారి జీవితాలలో చేదు అనుభవాలుగా మారిపోయాయని ఈ వర్గాల శ్రమతో దేశం ముందుకు దూసుకు వెళుతుంటే అభివృద్ధి ఫలాలు మాత్రం వారి దరి చేరడం లేదని అన్నారు. ప్రతి వెనకబడిన కుటుంబానికి గౌరవం, అవకాశాలు,హక్కులు, ముఖ్యంగా విద్య అందేలా చేయడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఆదర్శ పథకాలు ప్రవేశపెట్టిందని అన్నారు
బీసీ పిల్లలకు సమగ్ర విద్య అవకాశాలు
కులం ఆధారంగా శతాబ్దాలుగా జరిగిన అణిచివేతను తుడిచి పెట్టే శక్తి ఒక విద్యకు మాత్రమే ఉంది అని ప్రభుత్వం గ్రహించిందని, బీసీ వర్గాల పిల్లలకు సమగ్ర విద్య అవకాశాలు కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుందని ఎవరైనా తమ జీవితాన్ని మార్చుకునే తలుపు చదువు అనే ఆలోచనతో పేదవారి పిల్లలు వెనకడుగు వేయకుండా నాణ్యమైన విద్యను అందుకునేలా వసతి గృహాలు ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా చదువు ఒక ఆయుధంగా మారుతుందని అందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలంగాణలో బీసీ విద్యార్థుల కోసం రూపకల్పన చేస్తున్న పథకాలు కేవలం సంక్షేమ కార్యక్రమాలు కావు, అవి సామాజిక మార్పుకు పునాదులు అన్నారు. మోడల్ బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళు, ఆధునిక ప్రయోగశాలలు, డిజిటల్ తరగతి గదులు, అంతర్జాతీయ ప్రమాణాలతో హాస్టళ్లు, ఉచిత కౌన్సిలింగ్ కెరియర్ గైడెన్స్ ఇవన్నీ బీసీ పిల్లలకు సమాన పోటీ సామర్ధ్యాన్ని అందజేస్తాయని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాలు బిసి వర్గాల పిల్లలు జీవితంలో ఎవరితోనైనా సమానంగా పోటీ చేసే అవకాశాన్ని కల్పిస్తాయని ఆయన పేర్కొన్నారు. కులం ఎవరి కలలకు అడ్డు రాకూడదు అని మా ప్రభుత్వ అభిమతం అని అన్నారు. పిల్లలకు కూడా ప్రతిభను ప్రదర్శించేందుకు సరియైన వేదికలు కల్పించడం కాంగ్రెస్ తన బాధ్యతగా భావిస్తుందని అన్నారు కుటుంబాల పేదరికం సామాజిక వెనక బాటు పిల్లల భవిష్యత్తును నిర్ణయించే పరిస్థితి ఉండకూడదని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో బీసీలు శ్రమజీవులు ఉత్పత్తిదారులు సేవలను అలాంటి వర్గాలు అణగారిపోవడం సమాజానికే నష్టం కాబట్టి బీసీ వర్గాల గౌరవాన్ని హక్కులను అవకాశాలను కాపాడడం కేవలం పరిపాలనా నిర్ణయం కాదని అది సామాజిక న్యాయం అని అన్నారు.
విద్య ద్వారా బీసీలను శక్తివంతులుగా చేయడం కులానికి అణచి వేతను వ్యవస్థనుండి తొలగించడం ప్రతి బీసీ కుటుంబంలో కనీసం ఒక ఉన్నత విద్యావంతుని తయారు చేయడం ఉద్యోగాలు, వ్యాపారాలు, నైపుణ్య అభివృద్ధి ద్వారా ఆర్థిక స్థిరత్వం కల్పించడం బీసీ పిల్లలు దేశాన్ని నడిపే స్థాయికి చేరేలా చేయడం సమానత్వం కోసం పోరాటం ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యాలని బీసీల వెలుగుల భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందుతున్నాయని ప్రతి పేదవాడి ఇంట్లో చదువు వెలిగే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని, చదువుకోలేని అజ్ఞానం పెద్ద శత్రువు అని ఈ అజ్ఞానాన్ని మట్టు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుందని నూతి శ్రీకాంత్ గౌడ్ అన్నారు . తెలంగాణ బీసీల ఆత్మవిశ్వాసం నిండిన రేపటి పునాది విద్య. ఆ పునాదిని బలపరచడం కోసం సమాజంలో కొత్త ఉత్సాహాన్ని నింపడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలంగాణను సమానత్వపు సమాజంగా మార్చే దిశలో ముందడుగు వేస్తున్నామని ఇలాంటి కార్యక్రమాలు మాత్రమే కుల వివక్షను తుడిచిపెట్టి ఒక ఏకీకృత సమాజాన్ని నిర్మిస్తాయని విద్యా విజ్ఞానాన్ని అందిస్తుందని విజ్ఞానం విచక్షణను అందిస్తుందని తద్వారా సామాజిక సమానత్వం, రాజ్యాధికారం లభిస్తాయని నూతి శ్రీకాంత్ గౌడ్ పేర్కొన్నారు.