*మేడిపల్లి, పీర్జాదిగూడ స్మశాన వాటికలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి
తుంగతుర్తి రవి*
ఉప్పల్ అక్షిత ప్రతినిధి, ఆగస్టు 6:
మేడిపల్లి, పీర్జాదిగూడ డివిజన్ల పరిధిలోని స్మశాన వాటికల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించి, నిర్వహణను మరింత మెరుగుపరచాలని మేడిపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆర్వి ఫౌండేషన్ చైర్మన్ తుంగతుర్తి రవి అధికారులను కోరారు. ఈ మేరకు గురువారం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్కు ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడుతూ, స్మశాన వాటికలు ప్రతి ఒక్కరికీ అవసరమైన ప్రజా సేవా కేంద్రాలని, అక్కడ పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. స్మశాన వాటికల్లో తాగునీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా, తగినంత లైటింగ్, పరిశుభ్రతతో పాటు ఇతర మౌలిక వసతులు లేకపోవడంతో అంత్యక్రియలకు వచ్చే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా స్మశాన వాటికల నిర్వహణను మరింత పటిష్టంగా చేపట్టాలని, అవసరమైన అన్ని సౌకర్యాలను తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని ఆయన అధికారులను కోరారు. వినతిపత్రంపై సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సుదర్శన్ రెడ్డి, నాగరాజు, సాయిరాం గౌడ్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.