*ఉప్పల్ నియోజకవర్గ ఆలయాలకు బోనాల చెక్కుల పంపిణీ..*
*ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, బండారి లక్ష్మారెడ్డి
ఉప్పల్ అక్షిత ప్రతినిధి, ఆగస్టు 6: ఉప్పల్ నియోజకవర్గంలోని వివిధ దేవాలయాలకు తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన బోనాల చెక్కులను గురువారం హబ్సిగూడలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరుకాగా, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులకు బోనాల చెక్కులను అందజేసిన అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. ఆలయాల అభివృద్ధి, పండుగల నిర్వహణకు ప్రభుత్వం నిరంతరం అండగా ఉంటుందని తెలిపారు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే కాకుండా సామాజిక ఐక్యతకు ప్రతీకలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి అవసరమైన నిధులను కేటాయిస్తూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటోందన్నారు. బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తోందని చెప్పారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గంలోని అన్ని ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ఆలయాలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనులు దశలవారీగా చేపడుతున్నామని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయాల నిర్వహణ, పండుగల ఏర్పాట్ల కోసం అవసరమైన సహాయ సహకారాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన బోనాల చెక్కులు ఆలయాల నిర్వహణకు, ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహించేందుకు ఉపయోగపడతాయని ఆలయ కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.