ఘనంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమార్తె సప్నిరెడ్డి రిసెప్షన్ వేడుక
-రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అతిరథ మహారథులు హాజరు
-మరోమారు నిరూపితమైన పొంగులేటి ప్రభం ‘జనం’
-అంచనాను మించి హాజరైన ప్రజానీకం
-నూతన వధూవరులను దీవించిన వైఎస్ షర్మిల
– వేడుకలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఓ గర్బిణీ
( షేక్ సయ్యద్ ఖాసీం )
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
ఒకటి కాదు… రెండు కాదు వంద ఎకరాల్లో జరిగిన వేడుక వీక్షకులను కనువిందు చేసేందుకు అదిరిపోయే రాజస్థాన్ ప్యాలెస్ సెట్టింగ్ 20కి పైగా నోరూరించే వెజ్, నాన్ వెజ్ వంటకాలు… అతిథులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా భారీ ఏర్పాట్లు….. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అతిరథ మహారథులు ఒకే వేదికపై కనిపించిన అరుదైన ఘట్టం… అదే మన ఉమ్మడి ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ పొంగులేటి శీనన్న కుమార్తె సప్నిరెడ్డి వివాహ రిసెప్షన్ మహోత్సవం… అలాంటి కమణీయ… రమణీయ వేడుకను కనులారా వీక్షించి… నోరూరించే వంటకాల రుచిని ఆస్వాదించి వేడుకను విజయవంతం చేశారు… మన ఉమ్మడి ఖమ్మంజిల్లా ప్రజానీకం… పొంగులేటి ప్రభం ‘జనం’ సత్తా ఏంటో ఈ వేడుకతో మరోమారు నిరూపితమైంది.
…!
బుధవారం ఉదయం పది గంటలకు వేడుక ప్రారంభం కాగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలు ట్రాక్టర్లు, లారీలు, డీసీఎంలు, కార్లు, బస్సులు,
ద్విచక్రవాహనాలలో తండోపతండాలుగా తరలొచ్చారు. సాయంత్రం నాలుగు గంటల వరకు వేడుక జరిగే ప్రాంగణమంతా జనసందోహంతో కోలాహలంగా మారింది.
-అంచనాను మించి హాజరైన ప్రజానీకం…
పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమార్తె సప్నిరెడ్డి రిసెప్షన్ మసూత్సవానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 6.50లక్షల కుటుంబాలకు గోడగడియారం, పెళ్లి పత్రిక ఇచ్చి ఆహ్వానం పంపగా సుమారు మూడులక్షల మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేశారు. కానీ అంచనాను మించి మూడు లక్షలకు మందికి పైగా ప్రజలు హాజరైయ్యారు. చుట్టూ పక్కల ఎక్కడ చూసిన జనసందోహమే కనిపించింది.
-అతిరథమహారథులు హాజరు…!
కన్నులపండువగా జరిగిన ఈ వేడుకకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమార్తె సప్నిరెడ్డి, అల్లుడు అర్జున్ రెడ్డిలను దీవించడానికి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అతిరథ మహారథులు హాజరైయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. అనంతరం పొంగులేటి అతిథ్యాన్ని స్వీకరించారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హాజరుకావడం వేడుకలో ప్రత్యేకత సంతరించుకుంది. అదేవిధంగా మాజీమంత్రి, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, మాజీ ఎంపీ వివేక్ తో పాటు ఇంకా అనేక మంది రాజకీయ, వ్యాపార, వాణిజ్య , సినీ ప్రముఖులు హాజరయ్యారు.
– దారులన్నీ అటువైపే…!
ఉమ్మడి ఖమ్మంజిల్లాలోని దారులన్ని పొంగులేటి కుమార్తె రిసెప్షన్ వేడుకకు విచ్చేసే వాహనాలతో నిండిపోయాయి. ఏ వాహనాదారుడిని ఎటువెళ్తున్నారు అని పలకరించినా…మన శీనన్న గారాలపట్టిని దీవించడానికి వెళ్తున్నామనే సమాధానమే వినిపించింది. భారీ జనం రాకతో ఉమ్మడి ఖమ్మంజిల్లాలోని ప్రధాన రహదారులన్ని ట్రాఫిక్ తో స్తంభించిపోయాయి. ఇరు జిల్లాల పోలీసుల సమన్వయంతో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫికను చక్కదిద్దారు.
-అలరించిన సంగీత విభావరి…!
సినీ, టీవీ ఫేమ్ మిమిక్రీ శివారెడ్డి నేతృత్వంలో నిర్వహించిన సంగీత విభావరి వీక్షకులను అలరించింది. యాంకర్ శ్యామల, సింగర్ లిప్సిక తమ అభినయంతో ఆకట్టుకున్నారు. సుమారు నాలుగు గంటల పాటు నిర్వహించిన సంగీత విభావరిని చూసేందుకు ప్రజలు ఉత్సాహకత చూపారు.
*వేడుకలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఓ గర్బిణీ*
వేడుకను చూసి తరించేందుకు… శీనన్న అతిథ్యాన్ని స్వీకరించేందుకు వైరా నియోజకవర్గం నుంచి వచ్చిన ఏసుమణి అనే ఓ నిండు గర్భిణీ వేడుకలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంఘటన ప్రత్యేకత చాటుకుంది. భోజనం చేసే సమయంలో ఆ గర్భిణీకి నొప్పులు రావడంతో అదే సమయంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు, డాక్టర్ మట్టా దయానంద్ అక్కడే ఉండటంతో ఆ గర్బిణీకి పురుడు పోశారు. అనంతరం ఆ గర్భిణీని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లిబిడ్డ క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.