ఆపద్బాంధవుడు ‘కేసీఆర్
‘
* సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్
* 31 మంది బాధితులకు రూ.12లక్షల 20 వేలు 500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
నల్లమోతు భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆపద్బాంధవుడని మిర్యాలగూడ శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉన్నదని అభివర్ణించారు. ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) కింద మిర్యాలగూడ పట్టణానికి చెందిన మొత్తం 31 మంది బాధితులకు మంజూరైన రూ.12,20,500 విలువైన చెక్కులను మిర్యాలగూడ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ తో కలిసి భాస్కర్ రావు గురువారం అందజేశారు. ఆపద సమయంలో వైద్య ఖర్చుల కోసం బాధిత కుటుంబాలకు సీఎం సహాయనిధి నుంచి అందే సాయం ఆపద్బంధువులా ఆదుకుంటుందని అన్నారు. సీఎం అందజేస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం విషయంలో పూర్తి భరోసా కల్పిస్తోందని అన్నారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమంది నిరుపేదల ప్రాణాలు నిలబడ్డాయని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులను కాపాడేందుకు ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ కింద చికిత్స కోసం ఆర్ధిక సాయం అందజేస్తున్నదని భాస్కర్ రావు తెలిపారు. ప్రమాదవశాత్తూ గాయపడిన వారు కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ చికిత్స చేయించుకునేందుకు ప్రభుత్వం సహకరిస్తోందని అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వం సీఎంఆర్ ఎఫ్ చెక్కులను అందజేస్తోందని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందని భాస్కర్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు,మున్సిపల్ కమిషనర్ రవీంద్ర సాగర్, స్థానిక కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.