ఆసియాలోనే ప్రతిష్టాత్మకంగా
సూర్యాపేట ఇంటిగ్రేటెడ్ మార్కెట్
సూర్యాపేట, అక్షిత ప్రతినిధి :
ఆసియాలో ప్రతిష్టాత్మకంగా సూర్యాపేట పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం జరుగుతున్నదని తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్యశాఖ చీఫ్ ఇంజినీర్ శ్రీధర్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎస్టీపీ ప్లాంట్ను, చివరి దశలో ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాన్ని గురువారం సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సూర్యాపేటలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనంలో 165 కమర్షియల్ షాపులతో పాటు వివిధ వ్యాపారులకు అనుగుణంగా ఫ్లాట్ ఫామ్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేస్తున్న మార్కెట్లలో సూర్యాపేట రోల్ మోడల్గా నిలుస్తుందన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా కూరగాయలు, పండ్లు, పూలు, మటన్ అన్నీ ఒకే చోట దొరికేలా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. జమ్మిగడ్డలో ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణం పూర్తయిందని, అండర్ గ్రౌండ్ వద్ద పైప్లైన్ కనెక్షన్లు ఇవ్వాల్సి ఉందన్నారు. ఆయన వెంట సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ పి.రామానుజులరెడ్డి, కోదాడ కమిషనర్ మహేశ్వర్రెడ్డి, టీయూఎఫ్ఐడీసీ ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఈఈ సీహెచ్.సత్యనారాయణ, ఈఈ జీకేడీ ప్రసాద్, డీఈలు తదితరులున్నారు.